
- ఇక్కడ తవ్వి మరోచోటికి తరలిస్తున్న వ్యాపారులు
- కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకోని పాలకులు
- ఉపాధి కోసం వలస పోతున్న యువకులు
మహబూబాబాద్, వెలుగు : అపార ఖనిజాలు ఉన్నా అనుబంధ కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మహబూబాబాద్ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిపోతోంది. స్థానికంగా ఎలాంటి ఉపాధి మార్గాలు లేకపోవడంతో యువత, ప్రజలు పని కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
లీజ్లకే పరిమితం
మహబూబాబాద్ జిల్లాలో వివిధ ఖనిజాలకు సంబంధించి 197 లీజ్ అగ్రిమెంట్లు నడుస్తున్నాయి. గార్ల ఏజెన్సీలో బైరటీస్ ఖనిజం, గంగారం ఏజెన్సీలోని కణుజు వాగు వద్ద సున్నపురాయి నిల్వలు ఉన్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా బ్లాక్ గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి. జిల్లాలో డోలమైట్, బైరటీస్ కలిపి 2 లీజ్లు కొనసాగుతుండగా, విడివిడిగా డోలమైట్కు 1, బైరటీస్కు 4, క్వార్ట్జ్కు 1, బ్లాక్ గ్రానైట్ 168, కలర్ గ్రానైట్ 2, స్టోన్ అండ్ మెటల్కు కలిపి 19 లీజ్లు కొనసాగుతున్నాయి.
అక్రమంగా తవ్వుకుపోతున్న ‘పెద్దలు’
గార్ల మండలం శేరిపురం, పోచారం రిజర్వ్ ఫారెస్ట్లోని కంపార్ట్మెంట్ 12, 13, 11లో సుమారు1300 ఎకరాల్లో బైరటీస్ గనులు విస్తరించి ఉన్నాయి. ఇందులో సర్వే నంబర్ 78లో 300 ఎకరాలు, సర్వే నంబర్ 57, 58లో 300 ఎకరాల్లో తవ్వకాలకు మాత్రమే అధికారిక అను మతులు ఉన్నాయి. కానీ కొందరు వ్యక్తులు వంద లాది ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుపుతూ కో ట్లు గడించారు. 1965 నుంచి ఈ గనుల లీజ్ పొందిన ప్రైవేట్ కంపెనీ తర్వాత ప్రత్యేక మినహాయింపులు పొంది 2009 వరకు తవ్వకాలు కొనసాగించింది. తర్వాత గార్ల బైరటీస్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉందని అనుమతులను రద్దు చేయాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోరడంతో సుప్రీంకోర్టు జాయింట్ సర్వేకు తీర్పు ఇచ్చింది.
గార్ల బైరటీస్కు మస్త్ డిమాండ్
గార్ల ఏజెన్సీలో బైరటీస్కు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. టన్ను ఖనిజం రూ.10 నుంచి 15 వేలు పలుకుతోంది. పెట్రోల్ ట్యాంకుల నిర్మాణం, గ్యాస్ పైపుల తయారీ, ఔష దాల తయారీ, రాతి కళాఖండాలు, పె యింటింగ్ వర్క్లోనూ ఖనిజాన్ని ఉపయోగిస్తారు.
గంగారం ఏజెన్సీలో సున్నపురాయి
జిల్లాలోని మారుమూల ప్రాంతమైన గంగారం ఏజెన్సీ మడగూడెం శివారు కణుజు వాగు ప్రాంతంలో రూ. కోట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడి గిరిజనులు సున్నపురాయిని ముద్దలుగా చేసి నామమాత్రపు ధరకు దళారులకు అమ్ముతుంటారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన దళారులు నర్సంపేట, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హైదరాబాద్ వంటి నగరాల్లో ఎక్కువ రేటుకు విక్రయిస్తారు. మడగూడెంలో రెండు దశాబ్దాల కింద స్థాపించిన చాక్పీసుల తయారీ ఫ్యాక్టరీకి పాలకులు సహకరించకపోవడంతో ఆ మెషీన్లు తుప్పు పట్టి పాడైపోయాయి. ఈ ఖనిజంతో శానిటరీ, తెల్లటి వస్తువులు, కప్పులు, సాసర్లు, పింగాణి పాత్రలు, చాక్పీసులు తయారు చేయవచ్చు.
కంపెనీలు ఏర్పాటు చేయాలి
జిల్లా వ్యాప్తంగా బ్లాక్ గ్రానైట్, ఇతర ఖనిజ నిక్షేపాలున్నా అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడం లేదు. దీంతో ఇక్కడ దొరికే ఖనిజాలను రోజూ వందల లారీల్లో ఖమ్మం, చెన్నై, ఇతర ప్రాంతాల కు తరలిస్తున్నారు. స్థానికంగా కంపెనీలు ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి దొరక డంతో పాటు, ఇన్కం పెరుగుతుంది. - మాచర్ల వెంకన్న, ఖానాపురం
యువతకు తప్పని వలసతిప్పలు
మహబూబాబాద్ జిల్లాలో అపారమైన ఖనిజ నిక్షేపాలున్నా అనుబంధ కంపెనీలు లేకపోవడంతో యువతకు ఉపాధి కరువైంది. దీంతో స్థానికులు వివిధ పనుల కోసం సూరత్, భీవండి, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలకు వలస పోతున్నారు. దీంతో పాటు జిల్లా రెవెన్యూ కూడా తక్కువగా ఉండడంతో అభివృద్ధిలో వెనుకబడిపోతోంది. జిల్లాలో దొరికే ఖనిజాలకు సంబంధించిన కంపెనీలు స్థానికంగా ఏర్పాటు చేస్తే వలసలు తగ్గడంతో పాటు, జిల్లా ఇన్కం పెరుగుతుందని పలువురు భావిస్తున్నారు.