
- అనుచరులతో మీటింగ్లు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
- తమ సత్తా చూపుతామన్న జంగా రాఘవరెడ్డి
- ఇండిపెండెంట్గా బరిలో ఉంటానన్న ఇనుగాల వెంకట్రామిరెడ్డి
వరంగల్, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క డోర్నకల్ తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలకు కాంగ్రెస్ హైకమాండ్ క్యాండిడేట్లను ప్రకటించింది. శుక్రవారం రిలీజ్ చేసిన సెకండ్ లిస్ట్లో ఏడుగురికి అవకాశం దక్కగా.. టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నం చేసిన ఐదారుగురు సీనియర్లకు నిరాశే మిగిలింది. దీంతో తమ అనుచరులతో మీటింగ్లు పెట్టి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
పార్టీ మారడం లేదంటే ఇండిపెండెంట్గా బరిలో ఉంటామని కొందరు హైకమాండ్కు ఆల్టిమేటం జారీ చేయగా, మరికొందరు సైలెంట్ అయ్యారు. అసంతృప్తి లీడర్లను ఎలా బుజ్జగించాలో తెలియక టికెట్ దక్కిన లీడర్లు తలలు పట్టుకుంటున్నారు.
సెకండ్ లిస్ట్లో కొత్తోళ్లకే ప్రయారిటీ
కాంగ్రెస్ ఈ నెల 15న రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్ట్లో ములుగు నుంచి సీతక్క, నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి, స్టేషన్ఘన్పూర్లో సింగపురం ఇందిర, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణరావుకు టికెట్లు దక్కాయి. అయితే ఈ నియోజకవర్గాల్లో పోటీ కాస్త తక్కువగా ఉండడంతో టికెట్ల ప్రకటన అనంతరం ఎలాంటి అసమ్మతి, అలకలు బయటపడలేదు. శుక్రవారం సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసిన కాంగ్రెస్ వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, జనగామ, పాలకుర్తి, మహబూబాబాద్ టికెట్లను ఖరారు చేసింది.
ఇందులో నాలుగు నియోజకవర్గాల్లో కొత్తగా కాంగ్రెస్లో చేరిన వారికే ప్రయారిటీ ఇచ్చింది. వర్ధన్నపేటలో కేఆర్.నాగరాజు, పరకాలలో రేవూరి ప్రకాశ్రెడ్డి, పాలకుర్తిలో యశస్వినిరెడ్డి, మహబూబాబాద్లో మురళీనాయక్కు టికెట్లు దక్కాయి. ఈ నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు ఆశావహులు ఉండడం, సీనియర్లను కాదని కొత్తగా చేరిన వారికి టికెట్లు దక్కడంతో అసమ్మతి బయటపడుతోంది.
సీనియర్లు డిసప్పాయింట్
కాంగ్రెస్ సెకండ్ లిస్ట్లో ప్రకటించిన నియోజకవర్గాల్లో టికెట్ దక్కని సీనియర్లు, వారి అనుచరులు డిసప్పాయింట్ అయ్యారు. వర్ధన్నపేట టిక్కెట్ కోసం నియోజకవర్గ ఇన్చార్జి నమిండ్ల శ్రీనివాస్, కేఆర్ నాగరాజు, పరంజ్యోతి ప్రయత్నించారు. వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ దంపతులు వీలైతే శ్రీనివాస్కు లేదంటే పరంజ్యోతికి మద్దతు తెలిపారు. పార్టీ పెద్దలు మాత్రం నాగరాజు వైపే మొగ్గు చూపారు. దీంతో మిగతా ఇద్దరు ఆగ్రహంతో ఉన్నారు.
మరో వైపు వరంగల్ తూర్పు టికెట్ కోసం ఎర్రబెల్లి స్వర్ణ వరద రాజేశ్వర్రావు దంపతులు ప్రయత్నించినా దక్కకపోవడం, కనీసం తాము మద్దతు తెలిపిన ఇద్దరికీ ఇవ్వకపోవడంతో వారు అసంతృప్తితో ఉన్నారు. పరకాలలో ఇనుగాల వెంకట్రామిరెడ్డి, పాలకుర్తిలో తిరుపతిరెడ్డి, మహబూబాబాద్లో కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్, వరంగల్ పశ్చిమలో జంగా రాఘవరెడ్డి పార్టీపై గుర్రుగా ఉన్నారు.
హైకమాండ్పై ఫైర్
కాంగ్రెస్ టికెట్ దక్కని జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జులు హైకమాండ్పై ఆగ్రహంతో ఉన్నారు. వరంగల్ పశ్చిమ జంగా రాఘవరెడ్డి, పరకాలలో ఇనుగాల వెంకట్రామిరెడ్డి శనివారం తమ కేడర్తో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జంగా మాట్లాడుతూ అభ్యర్థులను మార్చాలని లేదంటే తమ సత్తా ఏంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. పరకాలలో ఇనుగాల మాట్లాడుతూ కాంగ్రెస్ పెద్దలు తనను నమ్మించి గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు బీఫాం ఇవ్వకుంటే పరకాల నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని హెచ్చరించారు. అలాగే హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరులో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైకమాండ్తోనే ఇన్నేళ్లు పనిచేశానని, అయినా తనను కాదని వేరొకరికి టికెట్ కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోటీలో ఉండాలా వద్దా అనేది కార్యకర్తలతో చర్చించాక ప్రకటిస్తానని చెప్పారు.