
న్యూఢిల్లీ: గత తొమ్మిది నెలల్లో టీమిండియా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. అందులో విజయం సాధించేందుకు సమష్టి పోరాటం చేసిందని గుర్తు చేశాడు. ఈ నేపథ్యంలో గత మూడు ఐసీసీ టోర్నీల్లో పాల్గొన్న ప్రతి ప్లేయర్ను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశాడు. ‘ఈ మూడు పెద్ద టోర్నీలో టీమ్ ఏం సాధించిందో చూడండి. మూడు టోర్నీల్లో ఒకే ఒక్క మ్యాచ్ (2023 వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాతో ఫైనల్) లో ఓడాం. కానీ అందులోనూ గెలిచి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి. నేనెప్పుడూ 24 మ్యాచ్ల్లో 23 విజయాలను వినలేదు.
బయటి నుంచి చూస్తే చాలా బాగుంటుంది. కానీ టీమ్ చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. అదే టైమ్లో మేం కూడా కొన్ని కఠినమైన సమయాలను ఎదుర్కొన్నాం. కాబట్టి ఈ మూడు టోర్నీల్లో ఆడిన ప్రతి ఒక్కరు గౌరవానికి అర్హులే’ అని హిట్మ్యాన్ పేర్కొన్నాడు. తన కెరీర్లో చాలా ఎత్తుపల్లాలను చవి చూశానని రోహిత్ వెల్లడించాడు. ‘నా 17, 18 ఏళ్ల కెరీర్ హెచ్చు తగ్గులతోనే కొనసాగించింది.
వాటి నుంచే నేను చాలా నేర్చుకున్నా. ముంబైతో నా ప్రయాణం ప్రారంభమైనప్పట్నించి ఇప్పటి వరకు చాలా విషయాలు మారాయి. అప్పుడు నేను మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసేవాడ్ని, ఇప్పుడు ఓపెనర్గా వస్తున్నా. అప్పుడు కెప్టెన్గా ఉన్నా. ఇప్పుడు కాదు. నాతో పాటు చాంపియన్షిప్ గెలిచిన ప్లేయర్లు కొంత మంది ఉన్నారు. మరికొంత మంది లేరు. కొంత మంది కోచింగ్ పాత్రలో ఉన్నారు. కాబట్టి పాత్రలు, చాలా విషయాలు మారాయి. కానీ మనస్తత్వం మాత్రం మారలేదు’ అని రోహిత్ వెల్లడించాడు.