
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మండల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గండిమైసమ్మ నుంచి మియాపూర్ వెళ్లే రూట్ లో టిప్పర్, వ్యాగనర్ కారు ఢీకొన్నాయి. స్నేక్ పార్క్ దగ్గర జరిగిన ఈ ఘోర ప్రమాదంలో TS 16 FK 2367 అనే నెంబరు గల కారు నుజ్జు నుజ్జు అయ్యింది. కార్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇవాళ (ఫిబ్రవరి 23, ఆదివారం) ఉదయం 6.45 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో కార్ డ్రైవర్, ప్రైవేటు ఉద్యోగి పున్నాల నాగవంశీ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో బుల్లెట్ పై వెళ్తున్న బాచుపల్లికి చెందిన వెంకట సురేంద్ర అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కాలు విరగడంతో సమీపంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.