బాచుపల్లిలో కారు బీభత్సం.. ఓవర్ స్పీడ్​తో భయానకం సృష్టించిన యువకుడు

బాచుపల్లిలో కారు బీభత్సం.. ఓవర్ స్పీడ్​తో భయానకం సృష్టించిన యువకుడు
  • షుగర్​కేన్ షాపు, మొబైల్ సర్వీస్ సెంటర్​ ధ్వంసం
  • వాహనంపై మాజీ మంత్రి మల్లారెడ్డి పేరుతో స్టిక్కర్ 

జీడిమెట్ల, వెలుగు: బాచుపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. చింతల్ ఐడీపీఎల్​కాలనీకి చెందిన విష్ణువర్ధన్​రెడ్డి ఇంటర్మీడియట్​పూర్తి చేసి ఇంజినీరింగ్ సీటు కోసం లాంగ్​టర్మ్​కోచింగ్​తీసుకుంటున్నాడు. గురువారం ఉదయం హుందాయ్​వెర్నా కారు (టీఎస్​15 ఈఎక్స్​7200)లో గండిమైసమ్మ నుంచి బాచుపల్లి వైపు ఓవర్​స్పీడ్ వెళ్తున్నాడు. విజ్ఞాన్​జ్యోతి స్కూల్​ముందు అదుపుతప్పి అక్కడ ఉన్న షుగర్​ కేన్​షాపు, మొబైల్ సర్వీస్ సెంటర్ ను ఢీ కొట్టాడు. 

ఆ సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు ఢీ కొన్న వేగానికి రెండు షాపు డబ్బాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన అనంతరం నిందితుడు కారును వదిలేసి పరారయ్యాడు. ఈ మేరకు బాధితుల ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, బీభత్సం సృష్టించిన కారుపై మాజీ మంత్రి, మేడ్చల్​ఎమ్మెల్యే మల్లారెడ్డి పేరుతో అసెంబ్లీ పాస్ స్టిక్కర్​అతికించి ఉంది. 

ఈ పాస్ మార్చి 31 వరకూ వాలిడిటీ ఉండడంతో నిందితుడి వద్దకు ఎలా వచ్చింది? మల్లారెడ్డికి అతనికి ఉన్న సంబంధమేంటి? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల క్యాసీనో కేసులో నిందితుడిగా ఉన్న మాధవరెడ్డి ఇంట్లోని వాహనానికి సైతం మాజీ మంత్రి మల్లారెడ్డి పేరుతో స్టీకర్ ఉండడం గమనార్హం.