
బిజినెస్ డెస్క్, వెలుగు: డబ్బులు విత్డ్రా చేసేటప్పుడు ఏటీఎం మెషిన్లో కార్డు ఇరుక్కుందా? వెంటనే సాయం చేయడానికి ఎవరైనా వచ్చారా? అందరూ అని చెప్పలేకపోయినా కొంత మంది మాత్రం డెబిట్ కార్డు హోల్డర్లను టార్గెట్గా చేసుకొని, వారి డబ్బులు కాజేస్తున్నారు. ఏటీఎం నుంచి మనీ విత్డ్రా చేసేటప్పుడు సాయం చేస్తున్నట్టు నటించి కార్డును నకిలీ కార్డుతో మార్చేస్తున్నారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయం చేస్తున్నారు. నమ్మలేకపోయినా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. గ్యాంగ్గా మారి, ఏటీఎంల చూట్టు మోసగాళ్లు పహారా కాస్తున్నారు. బలహీనంగా ఉన్నారనుకునేవారిని, మోసం చేయడానికి వీలుండే వారిని టార్గెట్ చేస్తూ వారి డెబిట్ కార్డును క్లోనింగ్ (అలాంటి కార్డునే క్రియేట్ చేయడం) లేదా మరో కార్డుతో రిప్లేస్ చేయడం వంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్బీఐ డేటా ప్రకారం, 2021–22 లో ‘కార్డ్/ఇంటర్నెట్/ ఏటీఎం/ డెబిట్ కార్డ్/ క్రెడిట్ కార్డ్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్’ కు సంబంధించిన 65,893 మోసాలు రికార్డయ్యాయి. ఈ మోసాల విలువ రూ.258.61 కోట్లకు పైనే ఉంది.
ఇలా జరుతోంది..
కార్డు క్లోనింగ్ ఫ్రాడ్స్కు గురైన వారు తమ ఎక్స్పీరియెన్స్ను పంచుకుంటున్నారు. ఒక ఏటీఎం దగ్గర తన కార్డును మోసగాళ్లు నకిలీ కార్డుతో స్వాపింగ్ చేశారని ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ ఒకరు పేర్కొన్నారు. తన ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ డెబిట్ కార్డును ప్రభుత్వ బ్యాంక్ డెబిట్ కార్డుతో మార్చారని వెల్లడించారు. ఏటీఎం మెషిన్లో తన కార్డు ఇరుక్కుపోయినప్పుడు సాయం చేస్తున్న నెపంలో ఇలా చేశారని గుర్తు తెచ్చుకున్నారు. ‘ఆ తర్వాత కేవలం 10 నిమిషాల్లోనే మనీ విత్డ్రా అయినట్టు తన ఫోన్కు మెసేజ్ వచ్చింది. కార్డును బ్లాక్ చేయడానికి వెంటనే బ్యాంక్ హెల్ప్లైన్ నెంబర్కు కాల్ చేశాను. ఒకవైపు తన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా అవుతుంటే, కార్డును డీయాక్టివేట్ చేయడానికి బ్యాంక్ ఉద్యోగులు చాలా టైమ్ తీసుకున్నారు’ అని ఈ ఢిల్లీ జర్నలిస్ట్ వెల్లడించారు. సంబంధిత బ్యాంకు వద్ద ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదని, ఆర్బీఐ అంబుడ్స్మన్ కూడా తొందరగా కేసు ఫైల్ చేయాల్సిందని పేర్కొందని అన్నారు. మనీని రీఫండ్ చేయలేమని బ్యాంక్ చేతులెత్తేసిందని వివరించారు.
‘ ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్లోని క్లాజ్ 16(2) (ఏ) ప్రకారం, సర్వీస్లో ఎటువంటి అంతరాయం లేదు. అందుకే ఫిర్యాదు రిజెక్ట్ అయ్యింది’ అనే మెసేజ్ అంబుడ్స్మన్ నుంచి వచ్చిందన్నారు. అదే రోజు ఈస్ట్ ఢిల్లీలో ఇలాంటి సంఘటననే మరొకటి చోటు చేసుకుంది. ఈసారి ఓ హౌస్వైఫ్ కార్డు మోసానికి బలయ్యారు. ఏటీఎం మెషిన్లో ఇరుక్కున్న తన కార్డును మోసగాళ్లు అదే బ్యాంక్ కార్డుతో రిప్లేస్ చేశారని, తన కార్డును దొంగలించి షాపింగ్ చేశారని, రూ. లక్ష వరకు నష్టపోయాక గాని కార్డును డీయాక్టివేట్ చేయలేకపోయానని ఆమె వివరించారు. ప్రజలను మోసం చేయడానికి మోసగాళ్లు కొత్త కొత్త విధానాలను ఫాలో అవుతున్నారు. కానీ, అంతే వేగంగా గ్రీవెన్స్ రిడ్రస్సల్ సిస్టమ్ పనిచేయడం లేదు. సిస్టమ్ వేగంగా పనిచేస్తేనే క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లు మరింతగా విస్తరిస్తాయి.
కార్డుల డీయాక్టివేషన్కు చాలా టైమ్..
మోసానికి గురయ్యామని తెలుసుకున్నా, కార్డు హోల్డర్లు వెంటనే డెబిట్, క్రెడిట్ కార్డులను డీయాక్టివేట్ చేసుకోలేకపోతున్నారు. బ్యాంకులు కూడా ఈ ఇష్యూకి సంబంధించి ప్రత్యేకమైన లైన్ను కేటాయించకపోవడంతో కార్డు డీయాక్టివేషన్ ప్రాసెస్కు చాలా టైమ్ పడుతోంది. ఫ్రాడ్ జరిగిన తర్వాత సైబర్ క్రైమ్ బ్రాంచ్, బ్యాంక్ బ్రాంచుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండడం లేదు. ‘మీ పిన్ నెంబర్తోనే విత్డ్రా జరిగిందని, మనీ రీఫండ్ కాదని’ బ్యాంకులు సమాధానమిస్తుండగా, కేసును పరిష్కరించడానికి సైబర్ క్రైమ్ బ్రాంచుల దగ్గర టైమ్ ఉండడం లేదు. వీరి దగ్గర పరిష్కారం కాని కేసులు చాలా ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులు ఇన్వాల్వ్ అయి ఉంటే బ్యాంకుల మధ్య కో–ఆర్డినేషన్ సమస్యగా మారుతోంది.