
పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్లో అమ్మాయిల ఈవెంట్లో అబ్బాయిలను ఆడిస్తున్నారన్న వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. పురుషుడిగా పుట్టి మహిళగా మారిందంటూ విమర్శలు ఎదుర్కొంటున్న అల్జీరియా బాక్సర్ ఖెలిఫ్ తన ఓపెనింగ్ బౌట్లో 46 సెకండ్లలోనే ఇటలీ బాక్సర్ ఏంజెలా కరిని ఓడించడం.. బౌట్ మధ్యలోనే పోటీ నుంచి వైదొలిగిన కరిని వెక్కివెక్కి ఏడవడంతో వివాదం మొదలైంది.
అయితే, ఖెలిఫ్ చేతిలో ఓడిన కరినికి ఓదార్పుగా ఐబీఏ ప్రైజ్మనీ ప్రకటించింది. కరినికి 50 వేల డాలర్లు, ఇటలీ బాక్సింగ్ ఫెడరేషన్, కరిని కోచ్కు తలో 25 వేల డాలర్లు ఇస్తామని ఐబీఏ ప్రెసిడెంట్ ఉమర్ క్రెమ్వెల్ తెలిపారు. కానీ, ఈ ప్రైజ్మనీని తాము అంగీకరించడం లేదని ఇటలీ బాక్సింగ్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఐబీఏపై నిషేధం ఉందని, నిషేధిత సంస్థ నుంచి ప్రైజ్మనీ తమకు అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే, కరిని, ఆమె కోచ్ ప్రైజ్మనీ తీసుకుంటారా? లేదా? అనే విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.