ఆటో యూనియన్ ​లీడర్ అమానుల్లాఖాన్​పై కేసు

ఆటో యూనియన్ ​లీడర్ అమానుల్లాఖాన్​పై కేసు
  •     జేటీసీ రమేశ్​కుమార్​పై దాడి చేసినందుకు చర్యలు 

హైదరాబాద్, వెలుగు :  ఖైరతాబాద్​లోని ఆర్టీఏ ఆఫీసులో గురువారం ఆర్టీఏ జాయింట్ కమిషనర్​రమేశ్​కుమార్​పై దాడిచేసిన ఆటో యూనియన్​నాయకుడు అమానుల్లాఖాన్​పై కేసు నమోదు చేసినట్లు రవాణాశాఖ కమిషనర్ బుద్ధప్రకాశ్​జ్యోతి తెలిపారు. ఖైరతాబాద్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్​కస్టడీ విధించిందన్నారు. దాడి జరిగిన వెంటనే తాము రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు సమాచారం ఇచ్చామని, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశామని వివరించారు.

కాగా జేటీసీ రమేశ్​ పై జరిగిన దాడిని తెలంగాణ గ్రూప్​–1 ఆఫీసర్స్​అసోసియేషన్, తెలంగాణ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ ఎన్జీవోస్ అసోసియేషన్, ట్రాన్స్​పోర్ట్​ఎంప్లాయిస్​ అసోసియేషన్, కానిస్టేబుల్స్​అసోసియేషన్ ఖండించాయి. దాడిని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ ఆఫీసుల్లోని అధికారులు, సిబ్బంది పెన్​డౌన్​చేశారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

నిరసనలు విరమించాలి : ట్రాన్స్ పోర్టు సంఘం

జేటీసీ రమేశ్ కుమార్ పై జరిగిన దాడిని ఆ శాఖకు సంబంధించిన వివిధ యూనియన్ల నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ట్రాన్స్ పోర్ట్ యూనియన్ నాయకులు పి.రవీందర్ గౌడ్, ఎస్ఎం హుస్సేనీ, సత్యనారాయణ, కృష్ణ యాదవ్, అరుణేందర్ ప్రసాద్, ప్రదీప్ రామకృష్ణ , ఎంజులారెడ్డి, శ్రీనివాస్, జ్ఞానేశ్వర్ నిరసన తెలిపారు. జేటీసీపై దాడిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్​గా తీసుకుందని

సీఎం రేవంత్ రెడ్డి ట్రాన్స్ పోర్టు ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ట్రాన్స్‌‌‌‌పోర్టు ఉద్యోగులు నిరసనలను విరమించి విధులకు హాజరుకావాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.