
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నారన్న ఆరోపణలపై మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు మరో 72 మందిపై బంగ్లాదేశ్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఢాకా చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్(సీఐడీ) ఈ మేరకు కేసు దాఖలు చేసిందని, కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.
నిరుడు డిసెంబరు 19న ఆన్లైన్లో షేక్ హసీనా మద్దతుదారులు సమావేశమై ‘జోయ్ బాంగ్లా బ్రిగేడ్’ పేరుతో ఓ వేదికను ఏర్పాటు చేశారని, దేశంలో సివిల్ వార్ ద్వారా యూనస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చర్చలు నిర్వహించారని సీఐడీ పేర్కొంది. ప్రస్తుత ప్రభుత్వాన్ని విధులు నిర్వహించకుండా అడ్డుకోవాలని ఆ మీటింగ్లో పాల్గొన్న వారు చర్చించారని సీఐడీ తన పిటిషన్లో తెలిపింది.
బంగ్లాదేశ్ తో పాటు విదేశాల నుంచి మొత్తం 577 మంది ఆ సమావేశంలో పాల్గొన్నారని, హసీనా ఆదేశాలకు మద్దతు తెలిపారని పోలీసులు చెప్పారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన అవామీ లీగ్ అమెరికా విభాగం ఉపాధ్యక్షుడు ఆలంను ఈ కేసులో రెండో నిందితుడిగా చేర్చామని వెల్లడించారు.