
- హోం శాఖ ఉత్తర్వులు పాటించాలని సూచన
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం శాఖ ఉత్తర్వులకు అనుగుణంగా ఏపీలో చేరాలని సీనియర్ ఐపీఎస్ అభిలాష బిస్త్ను కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్) బుధవారం ఆదేశించింది. కేంద్ర ఉత్తర్వులపై స్టే మంజూరు చేసేందుకు నిరాకరించింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో పటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను మార్చికి వాయిదా వేసింది. పశ్చిమ బెంగాల్ కేడర్కు చెందిన అభిలాష.. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారిని పెండ్లి చేసుకుని 1997లో తన కేడర్ను ఏపీకి మార్చుకున్నారు.
అనంతరం రాష్ట్ర విభజన సమయంలో ఆమెను ఏపీకి కేటాయించారు. కేటాయింపుల అంశంపై గతంలో క్యాట్ ఇచ్చిన ఆర్డర్ సాయంతో ఆమె 11 ఏండ్లుగా తెలంగాణలో కొనసాగుతున్నారు. తెలంగాణలో పనిచేస్తోన్న ఏపీ కేడర్ అధికారులు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి వెంటనే ఏపీకి వెళ్లేలా రిలీవ్ చేయాలని ఫిబ్రవరి 21న తెలంగాణను కేంద్రం ఆదేశించింది. దీంతో 22న తెలంగాణ సర్కార్ అంజనీకుమార్, అభిలాష బిస్త్ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
కాగా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అభిలాష సవాల్ చేసిన కేసును క్యాట్ జ్యుడీషియల్ సభ్యురాలు లతా బస్వరాజ్ పట్నే, పరిపాలన సభ్యురాలు శాలిని మిశ్రా ధర్మాసనం బుధవారం విచారించింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు విన్న తర్వాత తుది తీర్పు చెప్తామంది. కేడర్ అంశంపై బ్యాచ్ ఆఫ్ పిటిషన్లు ఉన్నందున అన్నింటిలో తీర్పు వెలువరిస్తామని తెలిపింది.