- కోల్కతా డాక్టర్ కేసులో సీబీఐ చార్జిషీట్
- గ్యాంగ్ రేప్ ఆరోపణలను ప్రస్తావించని ఏజెన్సీ
న్యూఢిల్లీ: కోల్కతా ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్రాయ్పై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. సీల్దాలోని ప్రత్యేక కోర్టులో చార్జి షీట్ సమర్పించినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు.
ఆగస్టు 9న ఆస్పత్రిలోని సెమినార్ హాల్లో డాక్టర్ నిద్రిస్తున్న సమయంలో నిందితుడు సంజయ్రాయ్ ఆమెను రేప్ చేసి, హత్య చేసినట్లు సీబీఐ తన చార్జిషీట్లో వెల్లడించింది. అయితే, గ్యాంగ్ రేప్ కి సంబంధించిన ఆరోపణలను మాత్రం ఛార్జిషీట్లో ప్రస్తావించలేదు. సంజయ్రాయ్ ఒక్కడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. చార్జిషీట్లో దాదాపు 200 మంది వాంగ్మూలాలు నమోదయ్యాయన్నారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆగస్టు 9 తెల్లవారుజామున సెమినార్ రూమ్లోకి సంజయ్ రాయ్ ప్రవేశించినట్లు నిర్ధారించిన కోల్కతా పోలీసులు.. ఆగస్టు 10న అతడిని అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు వివరించారు. ఆగస్టు 14న తాము దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ కేసులో తాలా పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అభిజిత్ మోండల్, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్లను కూడా అరెస్ట్ చేసినట్లు సీబీఐ తన ఛార్జిషీట్ లో పేర్కొంది.
ఘోష్ అవినీతి ఆరోపణలకు సంబంధించి మరో సీబీఐ కేసును కూడా ఎదుర్కొంటున్నారని తెలిపింది. ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని సీబీఐ అధికారులు తమ చార్జిషీట్లో పేర్కొన్నారు.
మూడో రోజుకు చేరిన నిరహార దీక్ష
ఆర్జీ కర్ వైద్యురాలికి న్యాయం చేయాలనే డిమాండ్ తో జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారానికి మూడో రోజుకు చేరింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మంగళవారం సాయంత్రం సెంట్రల్ కోల్కతా కాలేజీ స్క్వేర్ నుంచి ధర్మతాలా వరకు ర్యాలీ నిర్వహిస్తామని డాక్టర్లు ప్రకటించారు.