
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ(CBSE) 10, 12వ తరగతి పరీక్షలు జరగుతున్నాయి. ఈ క్రమంలో మొదటి రోజు నుంచే 12వ తరగతి పరీక్ష పేపర్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయి. దాంతో, సీబీఎస్ఈ బోర్డు స్పందించింది.
పేపర్ లీక్ అయినట్లు జరుగుతున్న ప్రచారం నిరాధారమని బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టించేందుకు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ఇప్పటికే దీనిపై దర్యాప్తు సంస్థలు విచారణ మొదలు పెట్టాయని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తప్పవని బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది.
విద్యార్థులకు, తల్లిదండ్రులకు అలెర్ట్
జరుగుతోన్న ప్రచారంపై బోర్డు.. విద్యార్థులను, తల్లిదండ్రులను అప్రమత్తం చేసింది. పుకార్లు నమ్మోద్దని.. పరీక్షకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని అధికారిక వెబ్సైట్(www.cbse.gov.in)లో మాత్రమే చూడాలని స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 15న ప్రారంభమైన సీబీఎస్ఈ 10, 12వ తగరతి పరీక్షలు ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. ఈ ఏడాది 42 లక్షలకు పైగా విద్యార్థులు బోర్డు పరీక్షలు రాస్తున్నారు. 24.12 లక్షల మంది 10వ తరగతి విద్యార్థులు 84 సబ్జెక్టులలో.. 17.88 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులు 120 సబ్జెక్టులలో పరీక్షలు రాస్తున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, సీసీటీవీల పర్యవేక్షణలో బోర్డు ఈ పరీక్షలు నిర్వహిస్తోంది.