జూన్ 1న ఫైనల్ ఫేజ్

జూన్ 1న ఫైనల్ ఫేజ్
  • 57 లోక్​సభ సెగ్మెంట్​లకు పోలింగ్
  • 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు
  • బరిలో మొత్తం 904 మంది అభ్యర్థులు
  • వారణాసి నుంచి మోదీ, మండి నుంచి కంగనా పోటీ

న్యూఢిల్లీ: లోక్​సభ ఫైనల్ ఫేజ్ ఎన్నికలు శనివారం నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తున్నది. చిట్టచివరి ఏడో దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. 8 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో కలిపి మొత్తం 57 లోక్​సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనున్నది. యూపీలో 13, పంజాబ్​లో 13, బిహార్​లో 8, బెంగాల్​లో 9, హిమాచల్​ప్రదేశ్​లో 4, ఒడిశాలో 6, జార్ఖండ్​లో 3, చండీగఢ్​లో ఒక లోక్​సభ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.  మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

పంజాబ్ నుంచి 328 మంది, యూపీ నుంచి 144 మంది, బిహార్ నుంచి 134 మంది, ఒడిశా నుంచి 66 మంది, జార్ఖండ్ నుంచి 52 మంది, హిమాచల్​ప్రదేశ్​ నుంచి 37 మంది, చండీగడ్ నుంచి నలుగురు పోటీలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ ఉంటుంది. ఈ ఫేజ్​లో ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి సెగ్మెంట్​కు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మండి నుంచి బీజేపీ తరఫున కంగనా రనౌత్, కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్య సింగ్ బరిలో ఉన్నారు.