
సెల్కాన్ చేతికి టచ్ మొబైల్స్
హైదరాబాద్, వెలుగు : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కలిపి 40 రిటెయిల్ స్టోర్లను నడుపుతున్న టచ్ మొబైల్స్ను సెల్కాన్ గ్రూప్ కొనుగోలు చేసింది. మొబైల్ మార్కెట్లో పెద్ద ప్లేయర్గా ఎదగాలనే ఆలోచనతోనే ఈ కొనుగోలు జరిపినట్లు సెల్కాన్ మేనేజింగ్ డైరెక్టర్ వై. గురు వెల్లడించారు. డీల్ విలువ ఎంతనేది మాత్రం కంపెనీ బయట పెట్టలేదు. ఎక్విజిషన్ తర్వాత టచ్మొబైల్స్ను భారీగా విస్తరించాలనుకుంటున్నట్లు గురు చెప్పారు. 50 సొంత రిటెయిల్ స్టోర్లు, 200 ఫ్రాంచైజీ స్టోర్లను ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
పెద్దగా చదువుకోని వారికి మొబైల్ సర్వీసింగ్లో శిక్షణ ఇచ్చి, సేల్స్–సర్వీస్ ఆదాయంతో సొంత కాళ్లపై నిలబడేలా ఫ్రాంచైజీ విధానాన్ని తెస్తున్నట్లు గురు వివరించారు. ఈ కొత్త స్టోర్ల ఏర్పాటులో మహిళలకు పెద్ద పీట వేయనున్నామని, వచ్చే నెలలో హైదరాబాద్లో మొదటిసారిగా అందరూ మహిళలే ఉండే స్టోరును లాంచ్ చేస్తామని తెలిపారు. మొబైల్ సర్వీసింగ్లో శిక్షణను 100 మందితో ప్రారంభిస్తామని, ఆ తర్వాత దశలవారీగా ఆ సంఖ్యను పెంచుతామని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు, మహారాష్ట్రలోనూ టచ్ మొబైల్స్ రిటెయిల్ స్టోర్లు ఏర్పాటవుతాయని అన్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో టచ్ మొబైల్స్ టర్నోవర్ను రూ. 200 కోట్లకు చేర్చాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
5 వేల కోట్లకు సెల్కాన్ టర్నోవర్...
2023–24 ఫైనాన్షియల్ ఇయర్లో సెల్కాన్ గ్రూప్ టర్నోవర్ రూ. 5 వేల కోట్ల మార్కును అందుకుంటుందనే ధీమాను గురు వ్యక్తం చేశారు. మొబైల్స్, మొబైల్ యాక్సెసరీస్, మొబైల్ రిటెయిలింగ్తో పాటు, మరికొన్ని సంబంధిత విభాగాలలోనూ సెల్కాన్ దూసుకెళ్లే ప్రయత్నాలను చేస్తోందని పేర్కొన్నారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ తయారీ భవిష్యత్లో పెద్ద బిజినెస్గా మారే అవకాశాలున్నాయని, చాలా రాష్ట్రాలకు మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ను తాము సప్లయ్ చేస్తున్నామని అన్నారు. 2022–23 లో సెల్కాన్ గ్రూప్ టర్నోవర్ రూ. 2,600 కోట్లు.