
- 2026 ఆర్థిక సంవత్సరంలో 4% జంప్
- డిమాండ్ 7 శాతం పెరిగే చాన్స్
- వెల్లడించిన క్రిసిల్ రిపోర్ట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ ధరలు 2-4 శాతం పెరుగుతాయని, తయారీ కంపెనీల సేల్స్కూడా భారీగా పెరగవచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రిపోర్ట్ తెలిపింది. దీని ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ 6.5 శాతం నుంచి 7.5 శాతానికి పెరుగుతుంది. మౌలిక సదుపాయాల , రూరల్ హౌసింగ్ ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు పెరగడం, సాధారణం కంటే ఎక్కువ వర్షాలు వచ్చే అవకాశాలు ఉండటం ఇందుకు కారణాలు. మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖలకు బడ్జెట్ కేటాయింపులలో 10 శాతం పెరుగుదల ఉంది.
ఈసారి భారీ వర్షాల వల్ల రూరల్ హౌసింగ్ డిమాండ్ పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఎన్నికలు రావడం, వర్షాల వల్ల నిర్మాణాలు తగ్గడం, గత మూడు ఆర్థిక సంవత్సరాలలో ఎక్కువ బేస్ వల్ల సిమెంట్ పరిశ్రమ డిమాండ్4.5-–5.5 శాతానికి పరిమితమయింది. పోటీ తీవ్రత పెరగడం, డిమాండ్ పడిపోయి ధరలు తగ్గడం వల్ల సిమెంట్ పరిశ్రమ కొన్ని కీలక మార్కెట్లలో సత్తా చూపలేకపోయింది.
ఇన్ఫ్రా సెక్టార్ కీలకం..
దేశీయ సిమెంట్ డిమాండ్లో దాదాపు మూడింట ఒక వంతు వాటా కలిగిన మౌలిక సదుపాయాల రంగం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్కు భారీ గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా రోడ్డు నిర్మాణ సంస్థలు భారీగా కొనుగోలు చేయవచ్చు. తరువాత రైల్వేలు, నీటిపారుదల, పట్టణ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. భారతీయ సిమెంట్ డిమాండ్లో 63–65 శాతం వాటా కలిగిన 12 రాష్ట్రాల బడ్జెట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొత్తం కేటాయింపులను 11 శాతం వరకు పెంచాయి. ఈసారి వర్షాకాలం వ్యవసాయ ఆదాయాన్ని పెంచుతుందని అంచనాలు ఉన్నాయి. రూరల్ హౌసింగ్నిర్మాణరంగం 32–-34 శాతం వాటాతో సిమెంట్ వినియోగంలో మెజారిటీ కొనుగోలుదారుగా నిలిచే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన వంటివి కూడా సిమెంట్ వాడకం పెరగడానికి దోహదపడతాయని క్రిసిల్ రిపోర్ట్ తెలిపింది.
"మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెరిగిన మూలధన కేటాయింపుల కారణంగా అన్ని విభాగాల నుంచి సిమెంట్కు డిమాండ్ పెరుగుతుందని మేం భావిస్తున్నాం. దీనివల్ల 2026లో ధరలు పెరగవచ్చని అంచనా వేస్తున్నాం. మార్కెట్ వాటా కోసం పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, కంపెనీలు లాభాలను పెంచుకోవడంపై దృష్టి సారించినందున పెరుగుదల 4 శాతం వరకు ఉండొచ్చు’’
-క్రిసిల్ ఇంటెలిజెన్స్ అసోసియేట్ డైరెక్టర్ సచ్చిదానంద చౌబే