ఏంట్రా ఇదంతా : శ్మశానంలో సినిమా షోలు.. అది కూడా చనిపోయిన వాళ్లకు..

ఏంట్రా ఇదంతా : శ్మశానంలో సినిమా షోలు.. అది కూడా చనిపోయిన వాళ్లకు..

శ్మశానం.. ఉదయం పూట వెళ్లటమే కష్టం.. ఇక రాత్రులు అయితే భయం.. అలాంటి శ్మశానంలో.. చనిపోయిన వాళ్ల కోసం రాత్రి సమయాల్లో సినిమా షోలు వేశారు.. రాత్రి 7 గంటల నుంచి అర్థరాత్రి వరకు చనిపోయిన వారి కోసం వరసగా సినిమాలు ప్రదర్శించారు. అంతేనా.. కుర్చీలు వేశారు.. ఆ కుర్చీల్లో స్నాక్స్ పెట్టారు.. మందు పెట్టారు.. ఏంటీ వింతగా.. విడ్డూరంగా అనిపిస్తుందా.. నిజం అండీ బాబూ.. థాయ్ లాండ్ దేశంలో వారంపాటు ఏకంగా ఈ ఉత్సవాలు చేశారు. ఎస్.. నిజం.. ఇంతకీ ఏం సినిమాలు వేశారు అని మాత్రం అడగొద్దు.. ఆ విశేషాలు మాత్రం తెలుసుకుందాం...

 రాత్రి పూట స్మశానంలో  సినిమా పాటలు.. సినీ ఫైట్​లలో దద్దరిల్లిపోతుంది.   థాయ్ లాండ్​ లో ఏకంగా స్మశాన వాటికలో సినిమాలు ప్రదర్శించారు. స్మశానంలో ఎవరు సినిమాలు చూస్తారు.. ఎందుకు... అక్కడ సినిమా ఈవెంట్​ను వారం రోజులు నిర్వహించారు.  అంటే చనిపోయిన వారు ఎంజాయి కోసమని ..  వారి ఆత్మల కోసం షోలు ప్రదర్శించారట.   ఇలా ఆత్మల కోసం వేసే సినిమాలను స్పూకీ అంటారని ఇంటర్​ నెట్​ ద్వారా తెలుస్తోంది . మనకు మ్యూజికల్​ నైట్​ ఎలాంటి జోష్​ ఇస్తుందో .. థాయ్​ లాండ్​ లో స్పూకీ ఈవెంట్​ మృతుల ఆత్మలకు అలాంటి జోష్​.. ఎంజాయిమెంట్​ ఇస్తుందట.   మృతుల స్మారకార్ధం.. వారి ఆత్మల కోసం  ఇలా సినీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 

 సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం...  ఈశాన్య థాయ్‌లాండ్‌లోని నఖోన్ రాట్చాసిమా ప్రావిన్స్‌లోని స్మశాన వాటికలో దాదాపు 3 వేల ఖాళీ కుర్చీలు వేశారు.  చనిపోయిన వారికోసం సినిమాలను ప్రదర్శించారు.  అంతేకాదు.. సినిమాహాళ్లలో ఉండే విధంగా కుర్చీలు వేశారు.  ఈ ప్రాంతంలో  ఎక్కువుగా చైనా నుంచి థాయ్​లాండ్​ వలన వచ్చిన వారు ఉండేవారని.. వారి వారసులకు చెందిన సమాధులు ఎక్కువుగా ఉన్నాయని  సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకటించింది.  

ఈశాన్య థాయ్‌లాండ్‌లోని నఖోన్ రాట్చాసిమా ప్రావిన్స్‌లోని స్మశాన వాటికలో  మృతుల ఆత్మల కోసం జూన్​ 2 నుంచి జూన్​ 6 వ తేదీ వరకు సినిమాలను ప్రదర్శించారు.  ఈ ఓపెన్​ఎయిర్​ షోలో నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి అర్దరాత్రి వరకు చలన చిత్రాలను ప్రదర్శించారు.  సినిమాలే కాదండోయ్​.. చనిపోయిన వారికి  ఆహారం, విందు, ఇళ్లు, వాహనాలు, దుస్తులు.. రోజు ఉపయోగించుకొనే పేపర్లు.. పెన్నులు కూడా అక్కడ పెట్టేవారట.  మృతులను స్మరించుకుంటూ, ఆధునిక వినోదాన్ని అందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

చింగ్ మింగ్ ఫెస్టివల్ తర్వాత...  డ్రాగన్ బోట్ ఫెస్టివల్‌కు ముందు మరణించిన వారి కోసం సినిమాలను ప్రదర్శించడం థాయ్‌లాండ్‌లోని అనేక చైనీస్ కమ్యూనిటీలలో సాంప్రదాయ ఆచారం అని నిర్వాహకులు తెలిపారు. స్మశానవాటికలో సినిమాలను ప్రదర్శించడానికి  మొదట్లో భయపడ్డానని ఈవెంట్ కాంట్రాక్టర్ చెప్పాడు.  SCMP నివేదించిన ప్రకారం, థాయిలాండ్‌లోని చైనీస్ కమ్యూనిటీ వారు మరణించిన వారి కోరికలు నెరవేరకపోతే  ... ఆత్మలుగా మారతాయని వారు నమ్ముతుంటారు. ఇలా సినిమాలు నిర్వహించడం ద్వారా వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని వారు చెబుతున్నారు.