గుడ్ న్యూస్ : ఏపీకి కొత్త రైల్వే లైన్​ ప్రాజెక్ట్ ప్రకటించిన కేంద్రం

గుడ్ న్యూస్ : ఏపీకి కొత్త రైల్వే లైన్​ ప్రాజెక్ట్ ప్రకటించిన కేంద్రం
  • రూ.1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి డబ్లింగ్​ పనులకు కేంద్రం ఆమోదం
  • ఏపీ, తమిళనాడులో 104 కిలోమీటర్ల మేర పనులు
  • కేంద్ర కేబినెట్​ భేటీలో కీలక నిర్ణయాలు
  • కమాండ్​ ఏరియా డెవలప్​మెంట్​కు రూ. 1600 కోట్లు
  • పంజాబ్, హర్యానాలో రూ.1,878 కోట్లతో జిరాక్‌పూర్ బైపాస్ రోడ్డుకు గ్రీన్​సిగ్నల్​

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్​కు కేంద్రం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించింది. తిరుపతి–-పాకాల-–కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్‌‌ పనులకు కేంద్ర కేబినెట్‌‌ ఆమోదం తెలిపింది. అలాగే,  ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పీఎంకేఎస్​వై) సబ్​స్కీమ్​ అయిన కమండ్​ ఏరియా కంట్రోల్ డెవలప్​మెంట్​ అండ్​ వాటర్​ మేనేజ్​మెంట్​ (ఎంసీఏడీడబ్ల్యూఎం) ఆధునీకరణను ఆమోదించింది. దీంతోపాటు పంజాబ్, హర్యానాలో భారీ బైపాస్​ రోడ్డుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను  కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. రూ.1,332 కోట్లతో తిరుపతి-–పాకాల-–కాట్పాడి డబ్లింగ్‌‌ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ పనులతో జంక్షన్​ విస్తరిస్తున్న ఏపీతోపాటు తమిళనాడులోనూ  అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

  ఈ మార్గంలోనే తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాక వినాయక టెంపుల్​, చంద్రగిరి కోట వంటి దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు.  ఈ నేపథ్యంలో ఇక్కడికి టూరిస్టులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, ఈ ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయన్నారు. తిరుపతి, వెల్లూరు ప్రాంతాల మధ్య వైద్య, విద్య హబ్‌‌లు ఉన్నాయని, వీటికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.  రాయలసీమ రీజియన్‌‌కు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ డబ్లింగ్ వల్ల సుమారు 400 గ్రామాలు, 14 లక్షల జనాభాకు మెరుగైన రైలు కనెక్టివిటీ లభిస్తుందని చెప్పారు.  కాగా, ఈ  డబ్లింగ్‌‌ పనులతో 35 లక్షల పనిదినాలు కల్పించే అవకాశం ఉందని తెలిపారు. ఏడాదికి 4 మిలియన్‌‌ టన్నుల సరుకు రవాణాకు అవకాశం ఉంటుందని చెప్పారు. 

ఎంసీఏడీడబ్ల్యూఎం ఆధునీకరణకు రూ. 1,600 కోట్లు

ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన (పీఎంకేఎస్​వై) సబ్​ స్కీమ్​అయిన కమాండ్​ ఏరియా డెవలప్​మెంట్​ అండ్​ వాటర్​ మేనేజ్ మెంట్​ (ఎంసీఏడీడబ్ల్యూఎం) ఆధునీకరణకు  కేబినెట్‌‌ ఆమోదం తెలిపింది. 2025–-26 సంవత్సరానికి గాను కమాండ్  ఏరియా అభివృద్ధికి  కేంద్రం రూ.1600 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ స్కీమ్​ కింద  ఆధునిక సాంకేతికతలైన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ),  ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ), జియోగ్రాఫిక్​ ఇన్ఫర్మేషన్​సిస్టమ్​ (జీఐఎస్​) ఉపయోగించి నీటిపారుదల వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది.  

పంజాబ్, హర్యానాలో భారీ బైపాస్​ రోడ్డు..

పంజాబ్, హర్యానాలో రూ.1,878.31 కోట్లతో నిర్మించనున్న 19.2  కిలో మీటర్ల జిరాక్‌‌పూర్ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్​గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. ఆరు లేన్ల జిరాక్‌‌పూర్ బైపాస్ ఎన్​హెచ్​-7 (జిరాక్‌‌పూర్–-పాటియాలా) జంక్షన్ నుంచి ప్రారంభమై ఎన్​హెచ్​-5 (జిరాక్‌‌పూర్–-పర్వానూ) జంక్షన్ వద్ద ముగుస్తుంది.  జిరాక్‌‌పూర్, పంచకుల పరిసర ప్రాంతాల్లో పాటియాలా, ఢిల్లీ, మొహాలి ఎరోసిటీ నుంచి ట్రాఫిక్‌‌ను మళ్లించడం, హిమాచల్ ప్రదేశ్‌‌కు ప్రత్యక్ష కనెక్టివిటీని అందించడం ద్వారా రద్దీని తగ్గించడం ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక ఉద్దేశం.