
న్యూఢిల్లీ: ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్చార్జి వసూలు చేసేలా కేంద్రం శాటిలైట్ ఆధారిత టోల్ విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ఇందుకు బండ్లకు ఫంక్షనల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ఉండాలి. ఇది ఉన్న ప్రైవేట్ వెహికల్స్ యజమానులు 20 కి.మీల వరకు టోల్చార్జీ లేకుండా ప్రయాణించవచ్చని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఈ మేరకు జాతీయ రహదారుల చార్జీల నియమాలను సవరించింది. 20 కిలోమీటర్లు దాటాక ప్రయాణించిన దూరాన్ని బట్టి చార్జీ వసూలు చేస్తారు. జీఎన్ఎస్ఎస్ లేని వాహనాలకు సాధారణ చార్జీలే వర్తిస్తాయి. ఫాస్ట్ట్యాగ్తో పాటు అదనపు సౌకర్యంగా పైలట్ ప్రాతిపదికన ఎంపిక చేసిన జాతీయ రహదారుల వద్ద జీఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని మొదట అమలు చేయాలని నిర్ణయించినట్లు జులైలో రహదారి మంత్రిత్వ శాఖ తెలిపింది.