![అమెరికా మతస్వేచ్ఛ రిపోర్టుపై కేంద్రం మండిపాటు](https://static.v6velugu.com/uploads/2024/06/center-has-alleged-that-the-report-released-by-america-on-religious-freedom-in-india-is-biased_bTQpaN875d.jpg)
న్యూఢిల్లీ: భారతదేశంలో మతస్వేచ్ఛపై అమెరికావిడుదల చేసిన నివేదిక పక్షపాతపూరితంగా ఉన్నదని కేంద్రం ఆరోపించింది. అది కొన్ని సంఘటనలను మాత్రమే ఎంపిక చేసుకొని, ఓటుబ్యాంకు రాజకీయాల కోసం రూపొందించిన నివేదిక అని పేర్కొంది. భారతదేశ సామాజిక నిర్మాణంపై అవగాహన కూడా లేకుండా ఈ రిపోర్ట్ తయారు చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్శుక్రవారం విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. గత నివేదికలాగే ఇది కూడా పక్షపాతంగా ఉన్నదని అన్నారు.
ఈ రిపోర్ట్ మన రాజ్యాంగ నిబంధనలు, దేశ చట్టాల చెల్లుబాటును ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్నదని పేర్కొన్నారు. భారతీయ కోర్టులు ఇచ్చిన కొన్ని చట్టపరమైన తీర్పుల సమగ్రతను కూడా ఇది సవాల్ చేస్తున్నదని అన్నారు. దేశంలో మైనార్టీలపై హింసాత్మక దాడులు పెరిగిపోయాయని బుధవారం విడుదలైన అమెరికా మతస్వేచ్ఛ రిపోర్ట్ వెల్లడించింది. 2023 మేలో మణిపూర్లో ప్రారంభమైన హింసను ఇది ఉదహరించింది.
మణిపూర్లో 253 చర్చిలు దగ్ధమయ్యాయని చురాచంద్పూర్ జిల్లాకు చెందిన కుకీ గ్రూప్ తెలిపిన విషయాన్ని ఈ నివేదిక ఉటంకించింది. వందలాది దేవాలయాలు ధ్వంసమయ్యాయని మైతీ కమ్యూనిటీ కూడా పేర్కొన్నట్టు వెల్లడించింది. దీనిపై స్పందించిన భారత్.. అమెరికాకు దీటైన సమాధానం ఇచ్చింది. 2023లో అమెరికా దేశంలోనే ద్వేషపూరిత నేరాలు, జాత్యహంకార దాడులు, భారత పౌరులు, ఇతర మైనార్టీలపైన దాడులు, ప్రార్థనా స్థలాల ధ్వంసం లాంటి ఘోరాలు జరిగాయని రణధీర్ జైస్వాల్ గుర్తుచేశారు. ఏదేమైనప్పటికీ భారతదేశంలోని ప్రజల రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడే హక్కు ఓ విదేశీ ప్రభుత్వానికి లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.