ఎక్కడ వాళ్లు అక్కడికి వెళ్లాల్సిందే: ఐఏఎస్‎లకు క్యాట్ బిగ్ షాక్

ఎక్కడ వాళ్లు అక్కడికి వెళ్లాల్సిందే: ఐఏఎస్‎లకు క్యాట్ బిగ్ షాక్

డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేసిన ఐఏఎస్ అధికారులకు కేంద్ర పరిపాలన ట్రిబ్యూనల్ (క్యాట్) బిగ్ షాకిచ్చింది. డీవోపీటీ ఆదేశాలు రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్‎లు దాఖలు చేసిన పిటిషన్లు క్యాట్ తోసిపుచ్చింది. డీవోపీటీ ఆదేశాలను పాటించాల్సిందేనని ఐఏఎస్‎లకు తేల్చి చెప్పింది. డీవోపీటీ ఆదేశాలకనుగుణంగా ఏ స్టేట్ కేడర్ అధికారులు అక్కడి రిపోర్ట్ చేయాలని క్యాట్ ఆదేశించింది. ఐఏఎస్ అధికారుల పిటిషన్‎పై విచారణ సందర్భంగా క్యాట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు.. అలాంటి చోటుకు వెళ్లి వారికి సేవ చేయాలని లేదా అని ఐఏఎస్ అధికారులను క్యాట్ ప్రశ్నించింది.

బోర్డర్‎లో సమస్యలు వస్తే వెళ్ళారా.. ఇంట్లో కూర్చొని సేవ చేస్తాం అంటే ఎలా  అంటూ క్యాట్ నిలదీసింది. డీవోపీటీ వన్ మ్యాన్ కమిటీని వేసినప్పుడు ఎందుకు స్పందించలేదు.. కోర్టు ధిక్కరణ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదని ఐఏఎస్‎లను క్వశ్చన్ చేసింది. ఐఏఎస్‎ల కేడర్ కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అధికారం డీవోపీటీకి ఉందని ఈ సందర్భంగా క్యాట్ గుర్తు చేసింది. ఇరువర్గాల వాదనల అనంతరం డీవోపీటీ ఆదేశాలపై స్టే విధించేందుకు నిరాకరించిన క్యాట్.. ఎక్కడ కేడర్ అధికారులు అక్కడికి వెళ్లాల్సిందేనని తీర్పు వెలువరించింది. 

ALSO READ | ఏపీకి వెళ్లం.. తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి

కాగా, తెలంగాణలో పని చేస్తోన్న ఏపీ కేడర్ ఐఏఎస్‎లను తిరిగి ఏపీకి వెళ్లాలని.. ఏపీలో పని చేస్తోన్న తెలంగాణ కేడర్‎కు చెందిన ఐఏఎస్ అధికారులు తెలంగాణ వెళ్లాలని డీవోపీటీ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో పని చేస్తోన్న ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, వాణి ప్రసాద్, ఏపీలో పని చేస్తోన్న తెలంగాణ కేడర్ అధికారిని సృజన డీవోపీటీ ఆదేశాలను క్యాట్‎లో సవాల్ చేశారు. సొంత కేడర్ స్టేట్లకు వెళ్లాలన్న డీవోపీటీ ఆదేశాలను రద్దు చేస్తూ.. తమను ప్రస్తుతం పని చేస్తోన్న రాష్ట్రాల్లోనే  కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని వేర్వేరుగా క్యాట్‎కు విజ్ఞప్తి చేశారు. ఐఏఎస్‎ల పిటిషన్లపై క్యాట్ 2024, అక్టోబర్ 15న విచారణ చేపట్టింది. 

ఐఏఎస్ అధికారుల కేటాయింపుపై డీవోపీటీకే పూర్తి అధికారులు ఉన్నాయని ఐఏఎస్ అధికారుల తరుఫు లాయర్లు వాదనలు వినిపించారు. డీవోపీటీ సైతం క్యాట్ ముందు తమ వాదనలను వినిపించింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం డీవోపీటీ వాదనలతో ఏకీభవించింది. డీవోపీటీ ఆదేశాల ప్రకారం.. ఐఏఎస్ అధికారులు సొంత కేడర్ రాష్ట్రాలకు వెళ్లాలని క్యాట్ తీర్పు వెలువరించింది. 2024 అక్టోబర్ 16వ తేదీ లోపు ఐఏఎస్‎లు తమ సొంత కేడర్ స్టేట్లలో రిపోర్ట్ చేయాలని డీవోపీటీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.  క్యాట్‎లో కూడా ఊరట దక్కకపోవడంతో ఐఏఎస్‎లు తిరిగి సొంత రాష్ట్రానికి వెళ్తారా లేక క్యాట్ ఆదేశాలను న్యాయస్థానంలో సవాల్ చేస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.