
న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 2 కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు అందాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు గురువారం లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ సురేశ్ షట్కర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. హైదరాబాద్లో ఐదు కారిడార్లకు సంబంధించిన మెట్రో ఫేజ్–2 ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం సమర్పించిందన్నారు. మెట్రోరైల్ ఫేజ్ 1ను పీపీపీ పద్ధతిలో చేపట్టామన్నారు.
దానికి పొడిగింపుగా మెట్రో పాలసీ 2017 చట్టం ప్రకారం అందించిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామన్నారు. ప్రాజెక్ట్ అవసరాలు, నిర్మాణ లభ్యతను బట్టి అనుమతులు ఆధారపడి ఉంటాయన్నారు. ఈ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ స్థాయిల్లో సమీక్షలు అవసరమని.. ఆ తర్వాతే ప్రాజెక్టు ఆమోదం లభిస్తుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.