కేంద్ర పథకాలను తెలంగాణ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది : పరుషోత్తం రూపాల

కేంద్ర పథకాలను తెలంగాణ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది : పరుషోత్తం రూపాల
  • కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తం రూపాల

సిద్దిపేట రూరల్, వెలుగు : కేంద్ర పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తం రూపాల ఆరోపించారు. మహాజన్ సంపర్క్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా గురువారం కేంద్ర మంత్రి సిద్దిపేటలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డితో కలిసి పర్యటించారు. మోడీ తొమ్మిదేళ్ల విజయాలను వివరిస్తూ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు రామచంద్రరావు, రమాదేవికి బుక్ లెట్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అధిక నిధులిస్తూ సహకరిస్తోందని తెలిపారు. పర్యటనలో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త కూర పండరి, సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి ఇంటికి మంత్రి వెళ్లి మోడీ పాలన విజయాలు వివరించారు.

శివాజీ నగర్ లోని హనుమాన్ గుడి ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. స్థానిక వీఏఆర్ గార్డెన్​లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో కలిసి ‘లంచ్ బాక్స్  బైటక్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ నాయకుడు చెంది సత్యనారాయణ అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకొని ఆయనను పరామర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్ యాదవ్, జిల్లా ఇన్​చార్జి అంజన్ కుమార్, సిరిసిల్ల జిల్లా ఇన్​చార్జి మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్, రామచంద్రా రెడ్డి, రాంచందర్ రావు , ఉపేందర్ రావు, మల్లేశం, వెంకటేశం, శ్రీనివాస్, శంకర్, వేణుగోపాల్, అరుణ రెడ్డి, సుగుణ, శివకుమార్, యాదన్ రావు తదితరులు పాల్గొన్నారు.

మల్లన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి 

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామిని గురువారం కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.  తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా సన్మానించారు. కొమురవెల్లి స్థానిక నేతలతో కలిసి కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే పనులను పరిశీలించారు. స్థానిక నేతల కోరిక మేరకు కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.