రేపు రాష్ట్రానికి కేంద్ర బృందం

రేపు రాష్ట్రానికి కేంద్ర బృందం
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన, నష్టం అంచనా
  • అనంతరం బాధితులు, అధికారులతో సమావేశం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. ఆరుగురు సభ్యులతో కూడిన ఈ బృందానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) అడ్వైజర్, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (ఆపరేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్) కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వం వహించనున్నారు. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు.. కేంద్ర ఆర్థిక, వ్యవసాయ, రోడ్లు– రహదారులు, గ్రామీణాభివృద్ధి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాఖలకు చెందిన అధికారులు ఉండనున్నారు. 11వ తేదీ ఉదయం ఈ బృందం తెలంగాణలో తీవ్ర వరద నష్టం సంభవించిన ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలతో పాటు ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా వరద బాధితులు, అధికారులతో చర్చించి నష్టాన్ని అంచనా వేయనున్నారు. కాగా, రాష్ట్రానికి రానున్న ఈ కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న కల్నల్ కీర్తిప్రతాప్ సింగ్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఆదివారం ఖమ్మం పర్యటనలో తాను తెలుసుకున్న అంశాలను, బాధితుల ఆవేదన, క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు. అయితే ఈ బృందం రాష్ట్రంలో వరద నష్టం, పరిస్థితులను అంచనా వేసి, కేంద్రానికి నివేదికను సమర్పించనుంది.