
- పట్టణ ప్రాంతాల్లో మంజూరుకు కేంద్రం అంగీకారం
- లక్ష మంది లబ్ధిదారుల వివరాలు అప్ లోడ్
- ఒక్కో ఇంటికి లక్షన్నర సాయం
- రూ. 1,500 కోట్ల ఫండ్స్ వచ్చే అవకాశం
హైదరాబాద్, వెలుగు: పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద రాష్ట్రానికి లక్ష ఇండ్లు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికిగానూ పట్టణ ప్రాంతాల్లో ఈ ఇండ్లను మంజూరుచేయనున్నట్టు సమాచారం ఇచ్చింది. కాగా, ఈ లక్ష ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను పీఎం ఆవాస్ వెబ్సైట్ లో ఇప్పటికే రాష్ట్ర గృహనిర్మాణ శాఖ అప్లోడ్ చేసింది. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులతో సమావేశమైన స్టేట్ హౌసింగ్ ఆఫీసర్లు రాష్ట్రానికి అర్బన్, రూరల్ కేటగిరీలో ఇండ్లు సాంక్షన్ చేయాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల మంజూరుకు అంగీకరించిన కేంద్ర అర్బన్హౌసింగ్ ఆఫీసర్లు.. రూరల్ ఇండ్లకు సంబంధించి కొన్ని మార్పు చేర్పులు చేయాలని రాష్ట్ర అధికారులను కోరినట్లు తెలిసింది.
ఒక్కో ఇంటికి లక్షన్నర
రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో ఒక్కో ఇంటికి రూ. 5 లక్షలు ఇచ్చేలా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. ఈ ఏడాది జనవరి 26న రూరల్ ఏరియాలో 71,500 ఇండ్లను మంజూరు చేసి, లబ్ధిదారులకు సాంక్షన్ పత్రాలను సైతం అందజేశారు. చాలాచోట్ల ఇప్పటికే వీటి నిర్మాణం మొదలైంది. కాగా, పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం అర్బన్ ఏరియాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షలు, రూరల్ ఏరియాల్లో రూ. 72 వేలు ఇవ్వనుంది. ఈ లెక్కన లక్ష ఇండ్లకు రూ. 1,500 కోట్లు రాష్ట్రానికి రానున్నాయి. దీంతో లక్ష ఇండ్లకు మిగతా రూ.3.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.
రెండో విడత లబ్ధిదారుల ఎంపిక
ఇందిరమ్మ ఇండ్లకు రెండో విడత లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతున్నది. తొలి విడతలో సర్కారు 71,500 ఇండ్లను మంజూరు చేయగా.. మండలానికో గ్రామాన్ని ఎంపిక చేశారు. ఇలా నియోజకవర్గానికి చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఇండ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం ఇస్తానన్న 3,500 ఇండ్లలో రెండో విడతలో సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో మంజూరు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది.
కేంద్రానికి రిక్వెస్ట్
రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో ఇండ్లు ఇవ్వాలని మొదటి నుంచి కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. గత ఏడాదే అర్బన్, రూరల్ లో కలిపి 9 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపారు. ఢిల్లీ వెళ్లిన సమయంలో ప్రధాని మోదీని కలిసిన సమయంలో కూడా సీఎం రేవంత్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర అర్బన్ హౌసింగ్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను సీఎం రేవంత్, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి, ఎక్కువ ఇండ్లు కేటాయించాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల మీద పీఎం ఆవాస్ యోజన స్కీం లోగో ఏర్పాటు చేస్తామని గతంలోనే సీఎం ప్రకటిం చారు. ఈనేపథ్యంలో వచ్చే నాలుగేండ్లలో ఎక్కువ ఇండ్లు మంజూరు చేయించుకునేలా రాష్ట్ర సర్కారు ప్రయత్నిస్తున్నది.