
- లోకల్ పంట చేతికందడంతో సగానికి పడిపోయిన రేట్లు
- గత నెలలో కిలో రూ.40.. ఇప్పుడు రూ.15 నుంచి రూ.20
- ఈ నెలాఖరుకు మరింత తగ్గే చాన్స్
- పెరిగిన యాసంగి దిగుబడి.. భారీగా నష్టపోతున్న రైతులు
హైదరాబాద్, వెలుగు: ఉల్లిగడ్డల ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. లోకల్గా పండించిన పంట మార్కెట్కు వస్తుండటంతో రేట్లు దిగివస్తున్నాయి. హైదరాబాద్లోని మలక్పేట్ హోల్సేల్ మార్కెట్లో గరిష్టంగా క్వింటాల్ రూ.1,200 ఉండగా, తక్కువలో తక్కువ రూ.500 నుంచి రూ.300 వరకు పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో రూ.15కు పైగా అమ్ముతున్నారు. నిరుడు మార్చిలో క్వింటాల్ ఉల్లి రూ.3,500 నుంచి రూ.2,800 వరకు పలికింది. గత నెలతో పోలిస్తే ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి.
డిమాండ్ కంటే ఎక్కువ సప్లై ఉండటంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెప్తున్నారు. మార్చిలో హోల్సేల్ మార్కెట్లో కిలో ఉల్లి గడ్డలు రూ.40 వరకు అమ్మారు. తాజాగా యాసంగి కొత్త పంట మార్కెట్కు వస్తుండటంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లోని మెయిన్ హోల్సేల్ మార్కెట్లు అయిన ఉస్మాన్గంజ్, మలక్పేట, సికింద్రాబాద్ మోండా, బోయిన్పల్లితో పాటు పలు రైతుబజార్లకు పెద్దఎత్తున ఉల్లి వస్తున్నది. దీంతో ధరలు పడిపోతున్నాయి.
రాష్ట్రంలో 40 వేల ఎకరాల్లో ఉల్లి సాగు
ఎక్కువగా మహారాష్ట్ర, కర్నూల్ నుంచే ఉల్లి దిగుమతి చేసుకుంటాం. ఇక్కడ వికారాబాద్ జిల్లా పరిధిలోని తాండూరు, మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, మహబూబ్నగర్లోని కొల్లాపూర్, అలంపూర్, నల్గొండ తదితర ప్రాతాల్లో 40వేల ఎకరాల్లో ఉల్లి సాగువుతున్నది. ఏప్రిల్, మే నెలల్లో పంట చేతికి వస్తుంది. దీంతో మార్కెట్లకు ఉల్లి గడ్డలు భారీగా వస్తున్నాయి.
హైదరాబాద్ సిటీలోని మార్కెట్లకు రోజుకు 15 వేల నుంచి 18 వేల క్వింటాళ్ల ఉల్లిగడ్డలు వస్తున్నాయి. మలక్పేట్, ఉస్మాన్గంజ్ మార్కెట్కు రోజుకు 5వేల క్వింటాళ్లకు పైగా గ్రేడ్ వన్ రకం ఉల్లి గడ్డలు తెస్తున్నారు. గ్రేడ్ 2 రకం 5,500 క్వింటాళ్ల వరకు వస్తున్నాయి. అదేవిధంగా, గుడిమల్కాపూర్, బోయిన్పల్లి మార్కెట్కూ ఉల్లి గడ్డలు వస్తున్నాయి. సదాశివపేట్, దేవరకద్ర మార్కెట్లకు ఉల్లి గడ్డలు వస్తుండటంతో ధరలు తగ్గుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి ధర మరింత తగ్గే చాన్స్ ఉన్నది. దీంతో రైతుకు పెద్దగా లాభాలు రావడం లేదు.
ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఎత్తేసిన కేంద్రం
ఉల్లిపై 20 శాతం ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఎత్తేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో ధరలు మరింత తగ్గాయి. 2023, డిసెంబర్లో దేశవ్యాప్తంగా ఉల్లి సంక్షోభం ఏర్పడింది. దీంతో ఉల్లిగడ్డల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 2024, మేలో ఎగుమతులను నియంత్రించినప్పటికీ కనీస ఎగుమతి ధర పెంచింది.
ఆ క్రమంలో 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. తర్వాత.. 2024, సెప్టెంబర్లో కనీస ఎగుమతి ధరను రద్దు చేస్తూ, 20 శాతం ఎక్స్పోర్ట్ ట్యాక్స్ వసూలు చేసింది. ఈ నిర్ణయం, దేశంలో ఉల్లి ధరలు తగ్గేందుకు, లోకల్ మార్కెట్లలో సరఫరా పెరిగేందుకు దోహదపడింది. తాజాగా, ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఎత్తేయడంతో దేశీయ ఉల్లి మార్కెట్పై ప్రభావం పడింది. దీనికి తోడుగా లోకల్గా పండించిన పంట మార్కెట్కు పోటెత్తుతున్నది.
దేశీయంగానూ పడిపోతున్న ధరలు
దేశంలోనే అతిపెద్ద హోల్సేల్ ఉల్లి మార్కెట్లుగా మహారాష్ట్రలోని లాసల్గావ్, పింపాల్గావ్లో ఉన్నాయి. ఏప్రిల్ 17న క్వింటాల్ ఉల్లిగడ్డలు యావరేజీగా రూ.1,240 నుంచి గరిష్టంగా రూ1,551 వరకు పలికింది. తక్కువలో తక్కువగా రూ.500 వరకు పలికింది.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా యాసంగిలో ఉల్లి ఉత్పత్తి 227 లక్షల టన్నులు ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇది నిరుడు కంటే 192 లక్షల టన్నులు ఎక్కువ. మొత్తం ఉల్లి ఉత్పత్తిలో 75 శాతం వాటా యాసంగి నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే వానాకాలం సీజన్ పంట చేతికొచ్చేదాకా ఉల్లి ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మార్కెటింగ్, హార్టికల్చర్ వర్గాలు పేర్కొంటున్నాయి.