- ఫైనాన్షియల్ సెక్టార్లో నిరుద్యోగానికి ఇదొక కారణం
- గిఫ్ట్ సిటీలో వచ్చే ఐదేళ్లలో 1.5 లక్షల కొత్త ఉద్యోగాలు
- బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, బ్రోకరేజ్ కంపెనీలకు భారీగా ఉద్యోగులు అవసరం: ఎఫ్పీఎస్బీ ఇండియా
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ సెక్టార్లో 18 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని, కానీ చేయగలిగేటోళ్లే లేరని ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ (ఎఫ్పీఎస్బీ) ఇండియా సీఈఓ కృష్ణన్ మిశ్రా పేర్కొన్నారు. గాంధీనగర్ (గుజరాత్) లోని గిఫ్ట్ సిటీలో ఫైనాన్షియల్ కంపెనీలు 6 వేల మందికి జాబ్స్ ఇచ్చాయని, ఇంకో ఐదేళ్లలో కొత్తగా 1.5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని అన్నారు. ‘నేషనల్ కెరీర్ సర్వీసెస్ పోర్టల్ ప్రకారం, ఇండియా ఫైనాన్షియల్ సెక్టార్లో కిందటేడాది 46.86 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. ఇందులో కేవలం 27.5 లక్షల ఉద్యోగాలు మాత్రమే నిండాయి. దీనిని బట్టి 18 లక్షల జాబ్స్ను తీసుకునేవారు లేరు. జాబ్స్ ఉన్నాయి. కానీ, చేయగలిగే సత్తా ఉన్నవారు లేరు. నిరుద్యోగానికి ఇదే కారణం’ అని మిశ్రా వివరించారు.
బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్రోకరేజ్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు స్కిల్స్ ఉన్నవారి అవసరం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో ఉన్న సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ (సీఎఫ్పీ) కంటే 40 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని, ఆన్లైన్లో సర్వే చేస్తే ఈ విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. కాగా, గ్లోబల్ సంస్థ ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ (ఎఫ్పీఎస్బీ) కు ఎఫ్పీఎస్బీ ఇండియా సబ్సిడరీ. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (సీఎఫ్పీ) సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ను ఈ సంస్థ నిర్వహిస్తోంది.
ఫైనాన్షియల్ ప్లానర్లకు డిమాండ్
‘ప్రస్తుతం ఇండియాలో 2,731 మంది సీఎఫ్పీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2.23 లక్షల మంది ఉన్నారు. 2030 నాటికి ఇండియాలో వీరి నెంబర్ 10 వేలకు పెరుగుతుంది. కానీ, అప్పటికి లక్ష మంది అవసరమవుతారు. ఇండియాలో పర్సనల్ ఫైనాన్స్ను పట్టించుకోవడం లేదు. డబ్బున్న వాళ్లకే ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరమని భావిస్తున్నారు. నిజానికి వెల్త్ మేనేజ్మెంట్ డబ్బున్నవాళ్ల కోసమైతే, ఫైనాన్షియల్ ప్లానింగ్ అందరి కోసం’ అని మిశ్రా వివరించారు.
ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీసులు అందించే ప్రొఫెషనల్స్ కోసం ట్రెయినింగ్ ప్రోగ్రామ్లు, వర్క్షాప్లు వంటివి నిర్వహించడానికి ఎఫ్పీఎస్బీ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎంఏ) తో ఎంఓయూ కుదుర్చుకుంది. గిఫ్ట్ ఐఎఫ్ఎస్సీని గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్గా ప్రమోట్ చేసేందుకు ఈ ఏడాది మే నెలలో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) తో టై అప్ అయ్యింది. గిఫ్ట్ సిటీ కోసం స్కిల్ ఉన్న ప్రొఫెషనల్స్ను తయారు చేయడమే ఈ భాగస్వామ్య లక్ష్యం.
గిఫ్ట్ సిటీలో బోలెడు జాబ్లు
ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్లలో ఉన్నారని, గాంధీనగర్ (గిఫ్ట్ సిటీ) కు షిఫ్ట్ కావడానికి ఆసక్తి చూపించడం లేదని మిశ్రా పేర్కొన్నారు. గిఫ్ట్ సిటీలోని కంపెనీలకు ట్యాలెంట్ ఉన్న ఉద్యోగులను అందించేందుకు ఐఎఫ్ఎస్సీఏతో తాజాగా ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు.
‘గిఫ్ట్ సిటీలో సుమారు 628 బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల ఆఫీసులు ఉన్నాయి. ట్యాలెంట్ తక్కువగా అందుబాటులో ఉండడంతో భారీగా ఉద్యోగులు అవసరమవుతారు’ అని మిశ్రా పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో 1.5 లక్షల ఉద్యోగాలు గిఫ్ట్ సిటీలో క్రియేట్ అవుతాయని, ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్, మేనేజ్మెంట్ సెగ్మెంట్లలో జాబ్స్ ఎక్కువగా అందుబాటులోకి వస్తాయని అంచనా వేశారు.