పదేండ్లైనా పనులు పూర్తి చేయలె: చాడ వెంకటరెడ్డి

పదేండ్లైనా పనులు పూర్తి చేయలె:  చాడ వెంకటరెడ్డి

హుస్నాబాద్​, వెలుగు : కరువు ప్రాంతమైన హుస్నాబాద్​ నియోజకవర్గంలో నీళ్లు పారించేందుకు ఏళ్ల తరబడి పోరాడామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా హుస్నాబాద్​కు వరదకాల్వ కావాలని సీపీఐ పోరాడితేనే గౌరవెల్లి, మిడ్​మానేరు  ప్రాజెక్టులు వచ్చాయన్నారు. 

తోటపల్లి ప్రాజెక్టును రద్దు చేసిన కేసీఆర్​ దాని నిర్వాసితుల సమస్యలను పట్టించుకోవడంలేదన్నారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వైఎస్​ రాజశేఖరరెడ్డితో గౌరవెల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించానని తెలిపారు. కాంగ్రెస్​ హయాంలోనే ప్రాజెక్టు పనులు మొదలై చాలా వరకు పూర్తయ్యాయన్నారు. 2014లోనే సీఎం కేసీఆర్​ ఇక్కడ కుర్చేసుకొని ప్రాజెక్టును పూర్తిచేస్తానని గప్పాలు కొట్టారని, పదేండ్లైనా పనులు పూర్తిచేయలేదని విమర్శించారు.

 పరిహారమడిగిన నిర్వాసితులను పోలీసులతో కొట్టించిన ఘనత ఆయనదన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని హుస్నాబాద్​లో బహిరంగసభ పెట్టుకొనేందుకు వస్తున్నారో చెప్పాలన్నారు. ఈ సమావేశంలో పవన్​, మల్లేశ్​, వనేశ్​, సత్యనారాయణ, భాస్కర్, సంజీవరెడ్డి, రాజుకుమార్, సృజన్​కుమార్​, శ్రీనివాస్, రాజు, సారయ్య​ పాల్గొన్నారు.

బీఆర్​ఎస్​, బీజేపీలను ఓడించడమే లక్ష్యం

కోహెడ: రానున్న ఎన్నికల్లో బీఆర్​ఎస్​,బీజేపీలను ఓడించడమే లక్ష్యంగా పని చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​ రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. దేశంలో,రాష్ర్టంలో కుల, మతాలతో బీఆర్​ఎస్​, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.  సమావేశంలో పవన్​, ఎల్లయ్య, గోపి, శంకర్​, లక్ష్మన్​, శ్రీనివాస్​ఉన్నారు.