మంచినీళ్లు అడిగి చైన్​ స్నాచింగ్.. ఇంట్లోకి చొరబడి గొలుసు తెంచుకుని పరార్

మంచినీళ్లు అడిగి చైన్​ స్నాచింగ్.. ఇంట్లోకి చొరబడి గొలుసు తెంచుకుని పరార్

కూకట్​పల్లి, వెలుగు: కేపీహెచ్‎బీ కాలనీలో పొద్దున ఆరు గంటలకే చైన్​స్నాచింగ్​జరిగింది. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళను మభ్యపెట్టిన దుండగుడు ఇంట్లోకి చొరబడి బంగారు గొలుసు తెంచుకుని పరారయ్యాడు. ఈ స్నాచింగ్​దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కేపీహెచ్​బీ పోలీసుల వివరాల ప్రకారం.. కేపీహెచ్‎బీ కాలనీ వేంకటేశ్వరస్వామి టెంపుల్ ఎదురు లైన్‎లోని ఈడబ్ల్యూఎస్​998 గ్రౌండ్​ఫ్లోర్‎లో నివసిస్తున్న అంజలి(50) బుధవారం ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. అదే సమయంలో ముఖానికి మంకీ క్యాప్,​చేతిలో ఖాళీ వాటర్​బాటిల్ పట్టుకొని వచ్చిన ఆగంతకుడు తొలుత ఆమెను ఏదో అడ్రస్​అడిగాడు. 

ఆ తర్వాత తనకు దాహం వేస్తుందని, మంచినీళ్లు అడిగాడు. అతనిపై జాలి పడిన మహిళ ముగ్గు డబ్బాని పక్కన పెట్టి, నీళ్ల కోసం ఇంట్లోకి వెళ్లింది. ఆమె వెనకాలే బాటిల్​పట్టుకుని ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసు తెంచుకుని పరారయ్యాడు. బాధితురాలు పెద్దగా కేకలు వేస్తూ వెంటపడినా దొరకలేదు. దీంతో బాధితురాలు ఫిర్యాదుతో నమోదు చేసుకుని కేపీహెచ్​బీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.