
హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు అంటే మూములు విషయం కాదు.. లక్షల మంది జనంతో.. నిత్యం రద్దీగా ఉండే ఏరియా. అందులోనూ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు టెంపుల్ ఏరియా అంటే.. 24 గంటలూ జనం తిరుగుతూనే ఉంటారు. అలాంటి ఏరియాలో.. ఓ చైన్ స్నాచర్ దర్జాగా ఇంట్లోకి వచ్చి మరీ.. మెడలోని బంగారం గొలుసు లాక్కుని వెళ్లటం సంచలనంగా మారింది.
2025, మార్చి 12వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో.. కేపీహెచ్ బీ టెంపుల్ బస్టాప్ సమీపంలోని ఓ ఇంటి ముందు.. ఓ మహిళ ముగ్గు వేస్తుంది. ముసుగు ధరించిన ఓ కుర్రోడు.. మంచి నీళ్లు కావాలంటూ ఆ మహిళను అడిగాడు. మంచినీళ్ల కోసం ఆ మహిళ ఇంట్లోకి వెళ్లగానే.. ఆమె వెనక ఆ చైన్ స్నాచర్ కూడా వెళ్లాడు.
ఆ మహిళ ఇంట్లోకి అడుగు పెళ్లిన వెంటనే.. వెనక నుంచి మెడలోని బంగారం మంగళసూత్రం లాక్కుని బయటకు పరిగెత్తాడు. షాక్ అయిన మహిళ పెద్దగా కేకలు వేస్తూ ఇంట్లో నుంచి వీధిలోకి పరుగులు తీసింది. అప్పటికే ఆ కిలాడీ చైన్ స్నాచర్ అక్కడికి వేగంగా పరిగెత్తుకుని వెళ్లిపోయాడు.
పొద్దుపొద్దునే జరిగిన ఈ ఘటనతో కేపీహెచ్ బీ కాలనీ ఉలిక్కి పడింది. చైన్ స్నాచర్లకు ఇంతకు బరితెగించారా అంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు కాలనీ వాసులు. ఈ ఘటన అంతా ఆ ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు.