
వెలుగు, కాగజ్ నగర్ : దేశంలో క్రికెట్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యమైన క్రికెట్ మ్యాచ్ ఉంటే వయసుతో సంబంధం లేకుండా చిన్నాపెద్దా కలిసి టీవీల ముందు అతుక్కుపోతారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు ఉండగా.. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల లోని ఓ పంక్షన్ హాల్ లో జరిగిన పెళ్లిలో ఏర్పాటు చేసిన ఎల్ ఈడీ స్క్రీన్లో లైవ్ మ్యాచ్ ప్రదర్శించారు. దీంతో పెండ్లికి అటెండ్ అయిన క్రికెట్ ప్రేమికులు ఆ వేడుకలతోపాటు ఫైనల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశారు.
చాంపియన్స్ ట్రోఫీలో అజేయ, అద్భుతమైన ఆటను కొనసాగించిన టీమిండియా ట్రోఫీ నెగ్గిన సంగతి తెలిసిందే. ఛేజింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ (83 బాల్స్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 76) జట్టును ముందుండి నడిపించడంతో ముచ్చటగా మూడోసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి పుష్కరకాలం తర్వాత మళ్లీ ట్రోఫీని అందుకుంది.
తొలుత న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 251/7 స్కోరు చేసింది. డారిల్ మిచెల్ (101 బాల్స్లో 3 ఫోర్లతో 63), మైకేల్ బ్రేస్వెల్ (40 బాల్స్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 నాటౌట్) ఫిఫ్టీలతో సత్తా చాటగా.. ఓపెనర్ రచిన్ రవీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34) ఫర్వాలేదనిపించారు. ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (2/40), వరుణ్ చక్రవర్తి (2/45) చెరో రెండు, జడేజా (1/30), మహ్మద్ షమీ (1/74) ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం ఇండియా 49 ఓవర్లలో 254/6 స్కోరు చేసి గెలిచింది. రోహిత్తో పాటు శ్రేయస్ అయ్యర్ (48), కేఎల్ రాహుల్ ( 34 నాటౌట్) రాణించారు. శాంట్నర్, బ్రేస్వెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. రోహిత్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా... రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు.