పాకిస్థాన్‎కి దెబ్బ మీద దెబ్బ.. కనీసం ‘ఫైనల్’ సంతోషం కూడా మిగిలనియ్యలేదు కదయ్యా

పాకిస్థాన్‎కి దెబ్బ మీద దెబ్బ.. కనీసం ‘ఫైనల్’ సంతోషం కూడా మిగిలనియ్యలేదు కదయ్యా

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి అతిథ్యమిస్తోన్న పాకిస్థాన్‎కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. దారుణమైన ఆటతో లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టిన దాయాది దేశానికి.. తాజాగా మరో షాక్ తగిలింది. ఆస్ట్రేలియా, భారత్ మధ్య 2025, మార్చి 4న జరిగిన సెమీస్‎లో టీమిండియా ఘన విజయం సాధించింది. కీలకమైన సెమీ ఫైనల్ పోరులో బౌలింగ్, బ్యాటింగ్‎లో రాణించిన రోహిత్ సేన.. కంగారులను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‎కు దూసుకెళ్లింది. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్‎కు చేరుకోవడంతో పాకిస్థాన్లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించే అవకాశాన్ని దాయాది దేశం చేజార్చుకుంది. 

ఎందుకంటే.. భద్రతా కారణాల దృష్ట్యా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచులు మొత్తం దుబాయ్‎లోనే నిర్వహిస్తు్న్నారు. ఇప్పుడు భారత్ ఫైనల్‎కు చేరుకోవడంతో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరు కూడా దుబాయ్ వేదికగానే జరగనుంది. ఈ సమీకరణాల నేపథ్యంలో.. ఎన్నో ఏండ్ల తర్వాత ఒక ఐసీసీ టోర్నీకి అతిథ్యం ఇచ్చిన పాకిస్థాన్‎కు భారత్ దెబ్బతో కీలకమైన ఫైనల్ మ్యాచ్ నిర్వహించే ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 తమ దేశ ఆటగాళ్ల తీరుతో లీగ్‎లోనే ఇంటిబాట పట్టిన మాకు.. భారత్ దెబ్బతో కనీసం సొంతగడ్డపై ఫైనల్ మ్యాచ్ చూసే అవకాశం లేకుండాపోయిందంటూ కుమిలిపోతున్నారు. ఇక, 2025, మార్చి 5వ తేదీన సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ 2 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‎లో గెలిచిన జట్టు 2025, మార్చి 9న దుబాయ్ వేదికగా భారత్‎తో ఫైనల్‎లో తలపడనుంది. సెమీస్ 2 పాకిస్థాన్‎లోనే జరగనుండగా.. ఈ మ్యాచులో గెలిచిన జట్టు వెంటనే దుబాయ్‎కి పయనం కావాల్సి ఉంటుంది.