
సిన్సినాటి టెన్నిస్ టైటిల్
సిన్సినాటి టెన్నిస్ టైటిల్ను కరోలిన్ గార్సియా సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో గార్సియా (ఫ్రాన్స్) 6–-2, 6-–4తో చెక్ రిపబ్లిక్ స్టార్ పెట్రా క్విటోవాను ఓడించింది. పురుషుల సింగిల్స్లో అన్సీడెడ్ కొరిచ్ (క్రొయేషియా) టైటిల్ నెగ్గాడు. ఫైనల్లో సిట్సిపాస్ (గ్రీస్)ను ఓడించాడు.
ఎఫ్టీఎక్స్ క్రిప్టో కప్
చాంపియన్స్ చెస్ టూర్లో భాగంగా జరిగిన ఎఫ్టీఎక్స్ క్రిప్టో కప్ చివరి రౌండ్లో ప్రజ్ఞానంద మాగ్నస్ కార్ల్సన్ ను ఓడించినా 16 పాయింట్లతో కార్ల్సన్ వరుసగా రెండో ఏడాదీ టైటిల్ గెలుచుకున్నాడు.
రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్
కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు అందించే అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది. ఎంపికలో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ‘రాష్ట్రీయ పురస్కార్’ పేరిట కేంద్ర హోం మంత్రిత్వ శాఖ www.awards.gov.in పోర్టల్ను రూపొందించింది.
నిరుపేద బాలికల కోసమే ‘ప్రాజెక్ట్ శక్తి’
విద్యతో పాటు వివిధ రంగాల్లో వంద మంది నిరుపేద బాలికలను ప్రోత్సహించడానికే ‘ప్రాజెక్ట్ శక్తి’ కార్యక్రమాన్ని చేపట్టామని పర్వతారోహకులైన మాలావత్ పూర్ణ, కావ్య మన్యపు (నాసా శాస్త్రవేత్త) తెలిపారు. ప్రాజెక్ట్ శక్తి పేరుతో లక్ష డాలర్ల (సుమారు రూ.80 లక్షలు) సేకరణే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
గిన్నిస్బుక్లో విద్యార్థులు
పంజాబ్లోని చండీగఢ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు జాతీయ జెండా ఆకారంలో నిల్చుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చోటు సంపాదించారు. 5,885 మంది విద్యార్థులు ఎగురుతున్న జాతీయ జెండా మాదిరిగా మైదానంలో బారులు తీరారు.
గోవాలో 100% కొళాయి నీరు
గోవా 100% గ్రామీణ కుటుంబాలకు కొళాయి నీరు సరఫరా చేయాలన్న లక్ష్యాన్ని అందుకుంది. జల్ జీవన్ మిషన్ కింద మూడేళ్లలో ఏడు కోట్ల గ్రామీణ కుటుంబాలకు కొళాయి నీటి సదుపాయాన్ని కల్పించిందని ప్రధాని తెలిపారు.
మహమ్మద్ ముస్తఫా
నాబార్డ్ చైర్మన్గా మహమ్మద్ ముస్తఫాను నియమించాలని ‘ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) సిఫార్సు చేసింది. ముస్తఫా యూపీ కేడర్కు చెందిన 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పదవీ కాలం ముగియనున్న ప్రస్తుత చైర్మన్ గోవిందరాజులు స్థానంలో ముస్తఫాను నియమించనున్నారు.
అజయ్ భల్లా
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఈమేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2023 ఆగస్టు 22 వరకు ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది.
విశ్వనాథ్ కార్తికేయ
హైదరాబాద్కు చెందిన పడకంటి విశ్వనాథ్ కార్తికేయ ఐరోపాలో అత్యంత ఎత్తయిన మౌంట్ ఎల్బ్రస్ పర్వతం తూర్పు, పడమర శిఖరాలను 24 గంటల వ్యవధిలో అధిరోహించాడు. ఎల్బ్రస్ పర్వతం పశ్చిమభాగం 5,642 మీటర్లు, తూర్పు శిఖరం 5,621 మీటర్ల ఎత్తులో ఉన్నాయి.
మాక్ రూథర్ఫర్డ్
బెల్జియం–బ్రిటిష్ రెండు పౌరసత్వాలు ఉన్న మాక్ రూథర్ఫర్డ్ చిన్న వయసులోనే రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించాడు. ఎవరూ తోడులేకుండా భూగోళాన్ని చుట్టిన అత్యంత పిన్నవయస్కుడిగా, మైక్రోలైట్ ప్లేన్లో ప్రపంచమంతా తిరిగి అత్యంత పిన్నవయస్కుడిగా రెండు రికార్డులు రూథర్ఫర్డ్ పరమయ్యాయి.
ఓడీఎఫ్ ప్లస్లో తెలంగాణ టాప్
బహిరంగ మల విసర్జనతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్థాలను సక్రమంగా నిర్వహిస్తూ ఓడీఎఫ్ (ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ) ప్లస్ స్థాయి పొందిన టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ నిలిచింది.
జీస్డీపీలో 19.37% వృద్ధిరేటు రాష్ట్ర జీఎస్డీపీలో ప్రస్తుత ధరల ప్రకారం 19.37 శాతం వృద్ధిరేటు, తలసరి ఆదాయంలో 19.19 శాతం వృద్ధిరేటు నమోదయ్యాయి.
అమెరికా నుంచి ఉక్రెయిన్కు డ్రోన్లు
రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్కు సైనిక సాయం అందిస్తున్న అమెరికా తాజాగా అధునిక స్కాన్ ఈగిల్స్ నిఘా డ్రోన్లు, మైన్ రెసిస్టెంట్ వెహికల్స్, హోవిట్జర్ ఆయుధాలను సరఫరా చేయనుంది. ఈ సైనిక సాయం విలువ 77.5 కోట్ల డాలర్లు.
చైనాలో తగ్గిన వృద్ధిరేటు
చైనాలో వర్షపాతం అతి తక్కువ స్థాయికి పడిపోవడంతో నదులు ఎండిపోవడం జలవిద్యుదుత్పత్తిని దారుణంగా దెబ్బతీసింది. కర్మాగారాలకు కరెంటు సరఫరా నిలిచిపోయి, పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతింటోంది. 2022లో 5.5% వృద్ధిరేటును సాధించాలనుకున్న డ్రాగన్ అందులో సగం రేటుతోనే సరిపెట్టుకుంది.
‘మదర్ హీరోయిన్’లకు పుతిన్ పురస్కారం
జనాభా తగ్గిపోతోందన్న ఆందోళన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోవియట్ కాలం నాటి పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. పది, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలను ‘మదర్ హీరోయిన్’గా గుర్తించి, 10 లక్షల రూబుళ్లను (రూ.13 లక్షలు) పురస్కారంగా ఇవ్వనున్నారు.
వీఎల్- ఎస్ఆర్శామ్ సక్సెస్
ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగించే వర్టికల్ లాంచ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (వీఎల్-ఎస్ఆర్శామ్)ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. దీన్ని డీఆర్డీవో, భారత నౌకాదళం నిర్వహించాయి.
సతీశ్ రెడ్డి
డీఆర్డీవో చైర్మన్గా కొనసాగుతున్న జి.సతీశ్ రెడ్డి రక్షణ శాఖ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా పనిచేయనున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన సతీశ్ రెడ్డి2018 ఆగస్టులో డీఆర్డీవో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. డీఆర్డీవో కొత్త చైర్మన్గా డా. సమీర్ వీ కామత్ నియమితులయ్యారు.
విమానాశ్రయానికి భగత్సింగ్ పేరు
పంజాబ్, హర్యాన రాష్ట్ర ప్రభుత్వాలు చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెట్టేందుకు అంగీకరించాయి. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, హర్యాన ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌటాలా మధ్య చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.