
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ మంగళవారానికి (అక్టోబర్ 17) సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈరోజు ( అక్టోబర్ 13) సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. జీఎస్టీ డీజీ రిపోర్ట్ను సీఐడీ కోర్టుకు అందించింది. చంద్రబాబు తరపున సాల్వే, సింఘ్వీ, సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ, వాదించారు. స్కిల్ స్కాంపై 2021లోనే ఎఫ్ఐఆర్ నమోదైందని, 2017కు ముందు కేసు నమోదైందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని సిద్దార్థ్ లూథ్రా వాదించారు. చంద్రబాబును అనేక కేసులతో ఇబ్బంది పెడుతున్నారని లూథ్రా కోర్టుకు తెలిపారు. ఫైబర్ నెట్ కేసులో కూడా 17 ఎ చట్టం వర్తిస్తుందని లూథ్రా వాదించారు. చంద్రబాబు తరపు లాయర్ల వాదనలను సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీ తప్పు పట్టారు. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేశారు.