
చార్మినార్ దగ్గరలోని లాడ్బజార్ తర్వాత కొద్ది దూరంలో యూరోపియన్ శైలిలో నిర్మించిన 4 ప్యాలెస్ల సముదాయమే చౌమహల్లా. ఈ ప్యాలెస్ను మక్కా మసీదు వెనుక ప్రాంతంలో సుమారు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో నిర్మించారు. రెండో నిజాం అయిన నిజాం అలీఖాన్ కాలంలోనే ఈ ప్రాంతంలో ఖిల్వత్ ప్యాలెస్ను నిర్మించారు. ఖిల్వత్ అంటే ఏకాంత ప్రదేశమని అర్థం. ఐదో నిజాం అఫ్జలుద్దౌలా ఇరాన్లోని షా ప్యాలెస్ను ఆధారంగా చేసుకొని ఖిల్వత్ ప్యాలెస్ ఉన్న ప్రాంతంలో ఈ చౌమహల్లా ప్యాలెస్ను నిర్మించాడు.
చౌమహల్లా అంటే నాలుగు అందమైన భవనాల సముదాయం. అవి..
1. అఫ్తాబ్ మహల్ 2. మహ్తబ్ ఆలయం 3. తహ్నియత్ మహల్ 4. అఫ్జల్ మహల్
1912లో ఏడో నిజాం చౌమహల్లాకు మరమ్మతులు చేయించి ఈ ప్యాలెస్ను మరింత అందంగా తీర్చిదిద్దారు. 1915లో చౌమహల్లాలోని ప్రధాన ద్వారం వద్ద ఏడో నిజాం ఒక పెద్ద గడియారాన్ని ఏర్పాటు చేశారు.