- మెగ్నీషియం సిలికేట్ సింథటిక్ను వాడుతున్నట్టు గుర్తించిన ఆఫీసర్లు
- తమిళనాడులో ఔట్ లెట్ సీజ్
చెన్నై: తమిళనాడులోని తూత్తుకూడి వేలావన్ మార్కెట్లోని కేఎఫ్సీ యూనిట్ లైసెన్స్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సస్పెండ్ చేశారు. కేఎఫ్సీ యూనిట్లో వినియోగించిన ఆయిల్ను ప్యూరిఫై చేసేందుకు మెగ్నీషియం సిలికేట్ సింథటిక్స్ను కలుపుతున్నట్టు గుర్తించి, ఈ చర్యలు తీసుకున్నారు. “వేలావన్ హైపర్ మార్కెట్లోని కేఎఫ్సీ ఔట్లెట్లో ఆకస్మిక తనిఖీ చేశాం. నూనెను శుద్ధి చేసేందుకు ఎఫ్ఎస్ఎస్ఏ నిబంధనలకు విరుద్ధంగా సింథటిక్స్ను వాడుతున్నారు.
18 కిలోల సింథటిక్ మెగ్నీషియం సిలికేట్, 45 లీటర్ల వాడిన నూనెను పట్టుకున్నాం. వీటితోపాటు 12 గంటల కింద ఫ్రై చేసిన 56 కిలో చికెన్ను స్వాధీనం చేసుకొని పరీక్షల కోసం ల్యాబొరేటరీకి పంపించాం” అని ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు. అలాగే, కృత్రిమ రంగులు వినియోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పానీపూరీ సెంటర్లలో కూడా తనిఖీలు చేపట్టామని, పానిపూరీ, మసాలకు సంబంధించిన మూడు శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపామని తెలిపారు.
అధికారులు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, దేశవ్యాప్తంగా తమ ఔట్లెట్స్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలకు అనుగుణంగానే ఆయిల్, చికెన్ వాడుతున్నామని కేఎఫ్సీ ఒక ప్రకటనలో పేర్కొన్నది.