
- 4 వికెట్ల తేడాతో
- ముంబైపై విజయం
- రాణించిన రచిన్, రుతురాజ్
- నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ సూపర్ బౌలింగ్
చెన్నై: ఐపీఎల్లో రెండు మేటి జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్ పైచేయి సాధించింది. ఛేజింగ్లో రచిన్ రవీంద్ర (45 బాల్స్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 65 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్ (26 బాల్స్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 53) రాణించడంతో.. ఆదివారం జరిగిన మ్యాచ్లో చెన్నై 4 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. టాస్ ఓడిన ముంబై 20 ఓవర్లలో 155/9 స్కోరు చేసింది. తిలక్ వర్మ (31) టాప్ స్కోరర్. తర్వాత చెన్నై 19.1 ఓవర్లలో 158/6 స్కోరు చేసింది. నూర్ అహ్మద్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బౌలర్లు అదుర్స్..
ముంబై బలమైన బ్యాటింగ్ లైనప్ను కట్టడి చేయడంలో చెన్నై బౌలర్లు సూపర్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా నూర్ అహ్మద్ (4/18), ఖలీల్ అహ్మద్ (3/29) కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో పాటు స్కోరు బోర్డును కట్టడి చేశారు. ఇంపాక్ట్గా వచ్చిన రోహిత్ శర్మ (0) నాలుగో బాల్కే డకౌటయ్యాడు. రైన్ రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) నిరాశపర్చడంతో ముంబై 36/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో సూర్యకుమార్ (29), తిలక్ వర్మ మెల్లగా ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు.
భారీ షాట్లకు పోకుండా నాలుగో వికెట్కు 51 రన్స్ జత చేశారు. పవర్ప్లేలో 52/3 స్కోరు చేసిన ముంబై ఫస్ట్ టెన్లో 82/3 స్కోరుతో నిలిచింది. కానీ 11వ ఓవర్లో సూర్య ఔట్కావడంతో ఇన్నింగ్స్ మళ్లీ తడబడింది. రాబిన్ మిన్జ్ (3), నమన్ ధీర్ (17), మిచెల్ శాంట్నర్ (11), బౌల్ట్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. చివర్లో దీపక్ చహర్ (28 నాటౌట్) బ్యాట్ ఝుళిపించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. అశ్విన్, ఎలిస్ చెరో వికెట్ తీశారు.
రచిన్, రుతురాజ్ సూపర్..
చిన్న ఛేజింగ్ను చెన్నై ఈజీగానే ముగించింది. రెండో ఓవర్లో రాహుల్ త్రిపాఠి (2) ఔటైనా, రచిన్ రవీంద్ర చివరి వరకు నిలబడ్డాడు. వన్డౌన్లో రుతురాజ్ మెరుపు బ్యాటింగ్ చేశాడు. లాంగాన్, లాంగాఫ్లో మూడు భారీ సిక్సర్లతో పాటు వీలైనప్పుడల్లా బాల్ను రోప్ దాటించాడు. ఈ క్రమంలో 22 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అవతలి వైపు రచిన్ నెమ్మదిగా ఆడినా చెత్త బాల్స్ను ఫోర్లుగా మల్చడంతో పవర్ప్లేలో సీఎస్కే 62/1 స్కోరు చేసింది. ఎనిమిదో ఓవర్లో రుతురాజ్ భారీ షాట్కు ట్రై చేసి ఔట్ కావడంతో రెండో వికెట్కు 61 రన్స్ భాగస్వామ్యం ముగిసింది.
ఈ దశలో కాస్త పుంజుకున్న ముంబై బౌలర్లు వరుస విరామాల్లో శివమ్ దూబే (9), దీపక్ హుడా (3), సామ్ కరన్ (4)ని ఔట్ చేసి ఒత్తిడి పెంచారు. దీంతో 116/5తో ఎదురీత మొదలుపెట్టిన చెన్నైని జడేజా (17) ఆదుకున్నాడు. రచిన్తో కలిసి ఆరో వికెట్కు 36 రన్స్ జత చేసి వెనుదిరిగాడు. ధోనీ (0 నాటౌట్) వచ్చినా.. నాలుగు రన్స్ అవసరమైన దశలో రచిన్ విన్నింగ్ సిక్స్ కొట్టాడు.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 155/9 (తిలక్ వర్మ 31, దీపక్ చహర్ 28*, నూర్ అహ్మద్ 4/18, ఖలీల్ అహ్మద్ 3/29). చెన్నై: 19.1 ఓవర్లలో 158/6 (రచిన్ 65*, రుతురాజ్ 53, విఘ్నేశ్ పుతూర్ 3/32).