
మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం మందమర్రి, క్యాతన్పల్లి మున్సిపాలిటీల్లో పర్యటించనున్నారని చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి టూర్ వివరాలను వెల్లడించారు.
మందమర్రి మున్సిపాలిటీలో రూ.204.8 కోట్లు, క్యాతన్పల్లి మున్సిపాలిటీలో రూ.108.16 కోట్లు, మొత్తం రూ.312.96 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజ చేస్తారని చెప్పారు. అలాగే మందమర్రి మండలం శంకర్పల్లిలో మ్యాట్రిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో రూ.500 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారన్నారు.
ఈ సందర్భంగా మందమర్రిలో రోడ్షో, రామకృష్ణాపూర్లోని ఠాగూర్ స్టేడియంలో సింగరేణి ఇండ్ల పట్టాల పంపిణీ అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు...
జిల్లాలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని బాల్క సుమన్ అన్నారు. కలెక్టరేట్లో జర్నలిస్టులతో మీటింగ్ నిర్వహించారు. మంచిర్యాలలో రూ.కోటితో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తామన్నారు. మండల స్థాయి రిపోర్టర్లు తహసీల్దార్ల సమన్వయంతో స్థల ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్కు పంపించాలన్నారు. వీటిని సీసీఎల్ఏకు పంపి అక్కడినుంచి అనుమతులు రాగానే ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అలాగే అర్హత గల జర్నలిస్టులకు గృహలక్ష్మి స్కీమ్ శాంక్షన్ చేస్తామన్నారు. ఎంపీ బి.వెంకటేశ్నేత, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొన్నారు.