- టీపీసీసీ జనరల్ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి
- ఓర్వలేక బీఆర్ఎస్ లీడర్లు తప్పుడు ఆరోపణలు
కోల్బెల్ట్, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో నియోజకవర్గంలో 14 నెలల కాలంలోనే రూ.800 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని టీపీసీసీ జనరల్ సెక్రటరీ పిన్నింటి రఘునాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం రామకృష్ణాపూర్లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టౌన్ ప్రెసిడెంట్పల్లె రాజుతో కలిసి ఆయన మాట్లాడారు.
సీఎం రేవంత్రెడ్డి, ఏఐసీసీ నేత, ఎంపీ రాహుల్గాంధీని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ స్థానిక లీడర్ రాజారమేశ్కు లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ఆశించి భంగపడ్డ రాజారమేశ్అక్కసుతో బీఆర్ఎస్లో చేరి ఇప్పుడు సీఎం, రాహుల్ గాంధీ, ఎమ్మెల్యేపై నిందలు వేస్తున్నాడని ఫైర్ అయ్యారు.
రూ.100 కోట్లతో జోడువాగుల వంతెన వద్ద ఫోర్ లేన్ హైవే నిర్మాణం, రూ.100 కోట్లతో మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో అమృత్ స్కీం ద్వారా డ్రికింగ్ వాటర్ సప్లై పనులు, రూ.250 కోట్లతో చెన్నూరు మండలం సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫండ్స్ మంజూరు చేయించారని గుర్తుచేశారు.
ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తిచేసేందుకు కేంద్రం రూ.18 కోట్లు చెల్లించేలా చొరవ చూపారన్నారు. ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నా బీఆర్ఎస్లీడర్లకు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయంలో రూ.1.25 లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం కుంగిపోవడంతో చుక్క నీళ్లు రాని పరిస్థితి నెలకొందన్నారు.
కాంగ్రెస్ నేతలను విమర్శించే స్థాయి రాజారమేశ్కు లేదని, వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఊరుకోబోమన్నారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్, పలిగిరి కనకరాజు, మున్సిపల్మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ జంగం కళ, ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, కుర్మ సురేందర్, బుడిగె శ్రీనివాస్, రామకృష్ణ, కట్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.