చేవెళ్ల, మొయినాబాద్​కు మున్సిపల్ కమిషనర్లు వచ్చేశారు

చేవెళ్ల, మొయినాబాద్​కు మున్సిపల్ కమిషనర్లు వచ్చేశారు
  • వీలిన గ్రామ పంచాయతీల ఆఫీస్​లు సీజ్
  • ఇక జీపీ కార్యదర్శలు మండల ఆఫీస్​కే వెళ్లాలి

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, చేవెళ్ల గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా అప్​డేట్​ కావడంతో ఆయా చోట్ల ప్రభుత్వం కమిషనర్లను నియమించింది. నార్సింగి మున్సిపల్ ​కమిషనర్​ కృష్ణమోహన్​రెడ్డికి చేవెళ్ల మున్సిపల్ కమిషనర్​గా అదనపు బాధ్యతలు అప్పగించింది. బండ్లగూడ మున్సిపల్​కమిషనర్ ​సతీశ్​చంద్రకు మొయినాబాద్ బాధ్యతలు ఇచ్చింది. సోమవారం మధ్యాహ్నం తర్వాత ఆర్డర్స్​ రావడంతో వీరు వెంటనే బాధ్యతలు స్వీకరించారు. 

సాయంత్రం నుంచి రాత్రి వరకు చేవెళ్ల, మొయినాబాద్ జీపీలతోపాటు ఈ రెండు మున్సిపాలిటీల్లో విలీనమైన 8 గ్రామ పంచాయతీలకు వెళ్లి బీరువాలు, రికార్డులు ఉన్న ఆఫీస్​లను సీజ్ చేశారు. పంచాయతీ కార్యాలయాల మీద ఉన్న పేర్లను కూడా రంగులు వేసి తొలగించాలని ఆదేశించారు. జీపీ కార్యదర్శులు ఇక మండల ఆఫీస్​కు మాత్రమే వెళ్లాలన్నారు. అలాగే ఇప్పటికే మున్సిపాలిటీగా ఉన్న శంకర్​పల్లి పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారిని నియమించింది.శంకర్​పల్లికి మున్సిపల్​అడ్మినిస్ట్రేషన్​డిప్యూటీ డైరెక్టర్​సాయినాథ్​, చేవెళ్ల, మొయినాబాద్​ మున్సిపాలిటీలకు జాయింట్ డైరెక్టర్​ పి.శ్రీధర్​ను నియమించింది.

స్పెషల్ ఆఫీసర్​గా  ప్రతిమా సింగ్ బాధ్యతలు

ఇబ్రహీంపట్నం, వెలుగు: పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో రంగారెడ్డి జిల్లాలోని 12 మున్సిపాలిటీలు, మూడు మున్సిపల్​కార్పొరేషన్లకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్ పేట, షాద్ నగర్, తుర్కయంజాల్ మున్సిపాలిటీలతోపాటు మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ కు జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) ప్రతిమా సింగ్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సోమవారం ఆమె కలెక్టరేట్​లో బాధ్యతలు చేపట్టారు.