చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు మృతి

చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు మృతి
  • మృతుల్లో ఎస్​జెడ్​సీ మెంబర్ ​సుధీర్​ అలియాస్​ సుధాకర్​
  • ఘటనాస్థలంలో 303 రైఫిళ్లతో పాటు 12 బోర్​ తుపాకులు సీజ్
  • మిగిలినవారి కోసం 500 మందితో  జల్లెడ పడుతున్న అధికారులు

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లోని దంతెవాడ  జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. గీదం పోలీస్​స్టేషన్ పరిధిలోని గిర్సాపారా, నెల్గోడ, బొడ్గా గ్రామ అడవుల్లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సంచరిస్తుందన్న ఇంటెలిజెన్స్ వర్గాల పక్కా సమాచారంతో డీఆర్జీ, ఎస్టీఎఫ్​, బస్తర్ ఫైటర్స్, కోబ్రా, సీఆర్​పీఎఫ్​, బీఎస్ఎఫ్​, ఐటీబీపీ, సీఏఎఫ్​ బలగాలు గాలింపు చేపట్టాయి. సుమారు 500 మందితో  ఈ ప్రాంతాలను జల్లెడ పట్టారు. 

బలగాలకు  దండకారణ్యం స్పెషల్ జోనల్​కమిటీ దళం కనిపించగా..ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.  ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోగా మిగిలినవారు పారిపోయారు. ఘటనా స్థలంలో  ఇన్సాస్​, 303 రైఫిళ్లతో పాటు 12 బోర్​ తుపాకీ, డిటోనేటర్లు, మందులు, నిత్యావసర సరుకులను అధికారులు సీజ్ చేశారు. మృతులను స్పెషల్​జోనల్​ కమిటీ మెంబర్​సుధీర్​అలియాస్​సుధాకర్​ అలియాస్​మురళి, దళ సభ్యులు ఆత్రం పండ్రూ, బార్సా మన్నూగా పోలీసులు గుర్తించారు. వరంగల్​ జిల్లాకు చెందిన సుధీర్​పై రూ. 25 లక్షల రివార్డు ఉందని  బస్తర్​ఐజీ సుందర్​రాజ్​వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్​మార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.     

ఇది పెద్ద విజయం: ఐజీ

దంతెవాడ ఎన్ కౌంటర్ మావోయిస్టులపై సాధించిన అతి పెద్ద విజయంగా ఐజీ సుందర్​రాజ్, డీఐజీ కమలోచన్​ కశ్యప్ అన్నారు.  దండకారణ్యం స్పెషల్​జోనల్​కమిటీలో అగ్రనేతను బలగాలు మట్టుబెట్టాయని తెలిపారు. 2026 మార్చి నాటికి దండకారణ్యాన్ని  మావోయిస్టు రహిత ప్రాంతంగా ప్రకటించేందుకు ఇది దోహదపడుతుందన్నారు. 2025లో    83 రోజుల్లో  100 మంది మావోయిస్టులను ఎన్​కౌంటర్​ చేయడం భద్రతాబలగాలలో పెరిగిన ఆత్మస్థైర్యానికి నిదర్శనమని చెప్పారు. 

మార్చి నుంచి జూన్​వరకు టీసీఓసీ( టాక్టికల్​ కౌంటర్​అఫెన్సివ్​ క్యాంపెయిన్​)పేరుతో మావోయిస్టులు తమ యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు.  పోలీస్​స్టేషన్లపై అటాక్స్ చేయడం, భద్రతా బలగాలను అంబుష్​చేసి చంపడం వంటి అనేక దాడులు ఈ కాలంలో చేస్తున్నారు. కానీ, గత రెండేళ్లుగా టీసీఓసీని భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి.  

మావోయిస్టుల్లో భయాన్ని  బయటపెట్టిన లేఖ

కేంద్ర హోంశాఖ 2026 నాటికి చత్తీస్​గఢ్​ దండకారణ్యంలో మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని ప్రకటన చేసి..అనంతరం దాడులు ఉధృతం చేసింది. విప్లవ కారిడార్​ రాజధాని అబూజ్​మాఢ్​లోనూ బేస్​ క్యాంపుల్లోకి భద్రతా బలగాలు చొచ్చుకుని పోయి దాడులు చేస్తున్నాయి. "లొంగిపోండి లేకుంటే చనిపోండి" అనే నినాదంతో జరుగుతున్న దాడులు.. మావోయిస్టు దళ సభ్యుల్లో భయం పుట్టిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

ఇటీవల ఎన్​కౌంటర్​ ప్రదేశాల్లో భద్రతా బలగాలకు దొరికిన ఒక లేఖ దీన్ని నిర్ధారిస్తోంది. మావోయిస్టు లీడర్ మోటూ తన భార్య నక్సల్ కమాండర్ మంగీకి లేఖ రాసి ప్రస్తుత పరిస్థితులను వివరించాడు. పార్టీపై జరుగుతున్న దాడులు, ఎన్​కౌంటర్లు, కేంద్ర హోంశాఖ అల్టిమేటం, సభ్యుల భయం ఆయన లేఖలో కన్పించాయి. దళాల్లో అభద్రతా భావం భద్రతాబలగాల్లో బలం రెట్టింపు చేసిందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.