
- కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత
వనపర్తి, వెలుగు :ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ గొప్ప అవకాశమని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం ఆర్ సునీత కోరారు. మంగళవారం జిల్లా కోర్టులో మార్చి 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ పై జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ రజనీతో కలిసి ప్రెస్మీట్లో మాట్లాడారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను, వివాదాలను పరిష్కరించుకోవచ్చన్నారు.
లోక్ అదాలత్ ద్వారా కోర్టులకు వెచ్చించే సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా, కోర్ట్ ఫీజు కూడా వాపస్ పొందవచ్చన్నారు. ఏదైనా కేసు ఒకసారి లోక్ అదాలత్ పరిష్కారం అయ్యిందంటే అది శాశ్వతంగా పరిష్కారమైనట్లేనని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమవుతున్న కేసుల విషయంలో, రాష్ట్రంలో వనపర్తి జిల్లా స్థానం రాను రాను మెరుగుపడుతోందన్నారు.
గత డిసెంబర్ 14 వ తేదీన నిర్వహించిన లోక్ అదాలత్ లో వనపర్తి జిల్లా కోర్టు అత్యధిక కేసులను పరిష్కరించి రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచిందని చెప్పారు. మార్చి 8వ తేదీన జరగబోయే లోక్ అదాలత్ లో మరిన్ని కేసుల పరిష్కారం ద్వారా వనపర్తి జిల్లా కోర్టు మరింత మెరుగైన స్థానాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.