పద్మ నా బిడ్డ.. ఆమె ఏది అడిగినా కాదనేది లేదు : కేసీఆర్

పద్మ నా బిడ్డ.. ఆమె ఏది అడిగినా కాదనేది లేదు : కేసీఆర్
  • ఏడుపాయలకు రూ.100 కోట్లు
  • మున్సిపాలిటీలకు భారీగా నిధులు
  • ప్రతి పంచాయతీకి రూ.15 లక్షలు

మెదక్, టౌన్, వెలుగు : ముఖ్యమంత్రి కేసీఆర్​ మెదక్​ జిల్లాపై వరాల జల్లు కురిపించారు. మెదక్​పట్టణానికి రింగు రోడ్డు, రామాయంపేట రెవెన్యూ డివిజన్​ఏర్పాటుకు సీఎం ఓకే చెప్పారు. బుధవారం జరిగిన ప్రగతి శంఖారావం సభలో మాట్లాడిన ఆయన ‘పద్మ నా బిడ్డ.. ఆమె ఏది అడిగినా కాదనేది లేదు’ అన్నారు. గత రెండు ఎన్నికల్లో ఆమెను ఎమ్మెల్యేగా గెలిపించడంతోనే మెదక్ జిల్లా వచ్చింది, కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులకు బ్రహ్మండమైన బిల్డింగ్​లు వచ్చాయని తెలిపారు. ‘రామాయంపేట రెవెన్యూ డివిజన్​ కావాలని పద్మ నన్ను అడిగింది. వెంటనే మంజూరు చేస్తున్న. ఎల్లుండి సాయంత్రం లోగా జీఓ వస్తుంది’ అని ప్రకటించారు.

ఏడుపాయలకు టూరిజం ప్యాకేజీ కింద రూ.100 కోట్లు ఇస్తామని చెప్పారు. జిల్లా కేంద్రమైన మెదక్​ పట్టణానికి రింగ్​ రోడ్డు  మంజూరు చేయడంతోపాటు,  మెద ‌‌క్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 50 కోట్లు, నర్సాపూర్​, తూప్రాన్​, రామాయంపేట మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని 469 గ్రామ పంచాయతీలకు కూడా రూ.15 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​ రెడ్డి విజ్ఞప్తి మేరకు కౌడిపల్లిలో డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నామన్నారు.

ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశం

ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​లో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్​ వన్​ గా నిలిచిందన్నారు. దేశంలో స్వచ్చమైన తాగునీరు ప్రతి ఇంటికీ అందిస్తున్నది, అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనని చెప్పారు. గతంలో రాష్ట్రంలో పెన్షన్​లు రూ.23 లక్షలు మాత్రమే ఉండగా,  ప్రస్తుతం రూ.54 లక్షల పెన్షన్ దారులు ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో మరింత పెంచుతామని చెప్పారు. ఘనపూర్​ ఆనకట్టను ఎలా బాగు చేశామో అదే తరహాలో సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ లు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. 3

అట్టహాసంగా ఆఫీసుల ప్రారంభం

ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, బీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసుల ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్​ చేతుల మీదుగా అట్టహాసంగా జరిగింది. అనంతరం కలెక్టర్​రాజర్షిషా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వారి కుర్చీలో కూర్చోబెట్టి వారిని ఆయన అభినందించారు. కలెక్టరేట్​లో దివ్యాంగులకు పెంచిన రూ.4.016 పెన్షన్​ చెక్కులు, బీడీ ఖార్ఖానాల్లో పనిచేసే టేకే దార్లకు, ప్యాకర్లకు కొత్తగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్లను లబ్ధిదారులకు సీఎం పంపిణీ చేశారు.