మిర్చి రేట్లు పెరుగుతున్నయ్.. ఇంటర్నేషనల్ మార్కెట్లో కదలికతో రైతులకు ఊరట

మిర్చి రేట్లు పెరుగుతున్నయ్.. ఇంటర్నేషనల్ మార్కెట్లో కదలికతో  రైతులకు ఊరట
  • చైనా, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాల్లో డిమాండ్
  •  క్వింటాల్​పై రూ.300 నుంచి రూ.500 వరకు పెరగనున్న ధర

హైదరాబాద్, వెలుగు: ఇన్నాళ్లు స్తబ్దతగా ఉన్న మిర్చీ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇంటర్నేషనల్​ మార్కెట్​లో కదలికల వల్ల మిర్చి యార్డులో ధరలు కొంత మేర పుంజుకుంటున్నాయి. మిర్చి రకాన్ని బట్టి క్వింటాల్​ కు సగటున రూ.300 నుంచి రూ.500 వరకు ధరలు పెరుగుతున్నాయి. 

రాష్ట్రంలో గత కొన్నాళ్లుగా మిర్చి ధరలు స్థిరంగా ఉన్న నేపథ్యంలో తాజా పెరుగుదల రైతులకు ఊరటనిస్తోంది.ఇటీవల ఎగుమతులు ఆశాజనకంగా ఉండడం, దేశీయంగానూ కొనుగోళ్లు పెరగడం, నాణ్యమైన మిర్చికి డిమాండ్ ఏర్పడడంతో ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. యార్డుకు వచ్చే మిర్చి పరిమాణం ఇదే తరహాలో ఉంటే ధరలు ఇంకాస్త పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్​ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తేజా మిర్చి రూ.13,500 

ప్రస్తుతం తేజా రకం మిర్చి ఖమ్మం మార్కెట్​కు రోజు వారీగా 19వేల నుంచి 20వేల క్వింటాళ్ల మిర్చి మార్కెటుకు వస్తోంది. గత నెల వరకు 11వేల నుంచి రూ.12వేల వరకు పలికిన ధరలు ఇప్పుడు క్రమంగా పెరిగాయి. దీంతో తేజా మిర్చి గరిష్ట ధర రూ.13,300 నుంచి రూ.13500 ధర పలుకుతోంది. మోడల్​ ధరలు రూ.11,500 నుంచి రూ.12,000 వరకు ధరలు ఉన్నాయి. 

వరంగల్​ మార్కెట్​కు రోజు వారీగా తేజా రకం మిర్చి 6వేల క్వింటాళ్లకు పైగా  మార్కెట్​కు వస్తుండగా.. ధరలు రూ.13వేల నుంచి 12వేల మధ్య  కొనసాగుతున్నాయి. అదే విధంగా వండర్​హాట్​రకం 2800 క్వింటాళ్లకు పైగా వస్తుండగా.. రూ.14వేల నుంచి రూ.15, 500 వరకు ధరలు పలుకుతున్నాయి. యుఎస్ 341 రకం 6 వేల క్వింటాళ్లు మార్కెట్​కు వస్తుండగా.. రూ.12వేల వరకు ధరలు పలుకుతున్నాయి. హైదరాబాద్​ లోని మలక్​పేట్​మహబూబ్​ మాన్షన్​ మార్కెట్​కు తక్కువ మొత్తంలోనే వెయ్యి క్వింటాళ్లలోపూ మిర్చి వస్తోంది.