
బీజింగ్: భారత్, చైనా పరస్పర గౌరవాన్ని చాటుకుంటున్నాయని.. రెండు దేశాల సంబంధాలపై అమెరికా కు చెందిన లెక్స్ ఫ్రిడ్మన్ పాడ్ కాస్ట్ షోలో మోదీ చేసిన పాజిటివ్ కామెంట్లను చైనా ప్రశంసించింది. ఏనుగు, డ్రాగన్ కలిసి డ్యాన్స్ చేయడం మంచి చాయిస్ అవుతుందని పేర్కొంది. సోమవారం బీజింగ్లో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మీడియాతో మాట్లాడారు. ‘‘2 వేల ఏండ్లకుపైగా ఇరు దేశాల మధ్య చారిత్రక, స్నేహపూర్వక సంబంధాలు, చర్యలు కొనసాగుతున్నాయి.
సివిలైజేషన్ సక్సెస్, మానవ పురోగతి నుంచి ఇరు దేశాలు ఒకదాన్నుంచి ఇంకొకటి చాలా నేర్చుకున్నాయి”అని ఆమె అన్నారు. గత అక్టోబర్లో రష్యాలోని కజాన్లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల సమావేశం తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయి, అభివృద్ధికి వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించిందని మావో నింగ్ చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా.. భారత్, చైనా తమ అభివృద్ధి, పునరుజ్జీవనాన్ని స్పీడప్ చేసే టాస్క్ను షేర్ చేసుకున్నాయన్నారు.