- 19 శాతానికి చేరిన వాల్యూమ్ షేర్
- రెండో స్థానానికి శామ్సంగ్
- వెల్లడించిన సీఎంఆర్ రిపోర్ట్
న్యూఢిల్లీ : చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షావోమీ జూన్ క్వార్టర్లో 19.3 శాతం వాల్యూమ్ షేర్తో మనదేశ స్మార్ట్ఫోన్ మార్కెట్లో అగ్రగామిగా నిలిచింది. సైబర్ మీడియా రీసెర్చ్ ఇండియా (సీఎంఆర్) మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్ రివ్యూ రిపోర్ట్ ఏప్రిల్–-జూన్ ప్రకారం, ఈసారి మనదేశ స్మార్ట్ఫోన్ మార్కెట్ 4 శాతం క్షీణించింది. మొత్తం మొబైల్ ఫోన్ షిప్మెంట్లు సంవత్సరానికి 3 శాతం తగ్గాయి. 2024 రెండో క్వార్టర్లో షియోమీ (19.3 శాతం), శామ్సంగ్ (18.5 శాతం) వివో (17 శాతం) వాటాతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఆ తర్వాత స్థానాల్లో రియల్మీ (13 శాతం), ఒప్పో (9 శాతం) ఉన్నాయి. ఆపిల్ 5 శాతం వాటాను దక్కించుకుంది. ఫీచర్ ఫోన్ సెగ్మెంట్లో చైనా కంపెనీ ఐటెల్ మొబైల్ 35 శాతం షేర్తో మార్కెట్లో మొదటిస్థానంలో కొనసాగుతోంది. స్వదేశీ మొబైల్ ఫోన్ కంపెనీ లావా 30 శాతం షేర్తో ఫీచర్ సెగ్మెంట్లో నోకియాను వెనక్కి నెట్టి రెండవ స్థానాన్ని ఆక్రమించింది. ఈ సెగ్మెంట్లో నోకియా మార్కెట్ వాటా ఏడాది క్రితం 17 శాతం నుంచి 11 శాతానికి తగ్గింది.
పెరిగిన 5జీ ఫోన్ల అమ్మకాలు
5జీ స్మార్ట్ఫోన్ షిప్మెంట్ల వాటా 79 శాతానికి పెరిగింది. ఇది వార్షికంగా 56 శాతం పెరిగింది. వివో 21 శాతం మార్కెట్ వాటాతో 5జీ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ముందుండగా, శామ్సంగ్ 20 శాతంతో ఆ తర్వాతి స్థానంలో ఉంది. రూ. 10వేలు–-13వేల ధర బ్యాండ్లోని 5జీ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు వార్షికంగా 200 శాతానికి పైగా పెరిగాయి. 5జీ ఏఐ స్మార్ట్ఫోన్లకు బలమైన డిమాండ్ కారణంగా 2024లో భారతదేశ స్మార్ట్ఫోన్ మార్కెట్ 7-8 శాతం వృద్ధి చెందుతుందని అంచనా.
ప్రీమియం సెగ్మెంట్ (రూ. 25వేలు కంటే ఎక్కువ) 9 శాతం వృద్ధిని సాధించింది. అయితే బడ్జెట్ స్మార్ట్ఫోన్ సెగ్మెంట్ (రూ. 7వేల కంటే తక్కువ) ఫోన్ల అమ్మకాలు వార్షికంగా 26 శాతం తగ్గాయి. రూ.ఏడు వేలు–-25వేలు మధ్య ధర గల ఫోన్ల వాటా 71 శాతానికి పెరిగిందని సీఎంఆర్ తెలిపింది.