
మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు : ఎంబీసీ(ముక్త్యాల బ్రాంచ్ కెనాల్) లిఫ్ట్ ద్వారా రెండోసారి భూములు కోల్పోతున్నామని, తమకు వీలైనంత ఎక్కువ పరిహారం ఇవ్వాలని సూర్యాపేట జిల్లా చింతలపాలెం రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని జలసౌధలో ఇరిగేషన్, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని రైతులు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా నిర్మిస్తున్న ఎంబీసీ లిఫ్ట్ ద్వారా తాము భూములు కోల్పోతున్నామని, గతంలో శివగంగ లిఫ్ట్ ను ఏర్పాటు చేసినప్పుడు కూడా భూములు కోల్పోయామని తెలిపారు.
రెండోసారి 110 మంది రైతులు భూములు కోల్పోతున్నారని, వారికి ఎక్కువగా పరిహారం అందించాలని కోరారు. మంత్రి స్పందిస్తూ అధికారులతో ఫోన్ లో మాట్లాడి రైతుల విజ్ఞప్తులను పరిశీలించి పరిహారం విషయంలో న్యాయం చేయాలని ఆదేశించారు.