![వేవ్స్ అడ్వైజరీ బోర్డులో చిరంజీవి](https://static.v6velugu.com/uploads/2025/02/chiranjeevis-place-on-waves-advisory-board_Mak0qIGwmo.jpg)
హైదరాబాద్, వెలుగు: వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను తొలిసారిగా భారత్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో మీడియా, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన వేవ్స్పై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.. ప్రతిష్టాత్మక ఈ సమ్మిట్ను ఈ ఏడాది చివరలో నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నది. ఈ మేరకు ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం నాడు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాని వారితో మాట్లాడుతూ.. వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. సమావేశంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, అమీర్ఖాన్, స్టార్ హీరో అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, హేమమాలిని, దీపిక పదుకొణే, ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మిట్లో తనను భాగం చేసినందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రధానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అడ్వైజరీ బోర్డ్లో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు. తనకు దక్కిన అరుదైన గౌరవానికి ధన్యవాదాలు తెలియజేశారు.