
చిట్ ఫండ్ కంపెనీలో ఏజెంట్ గా చేస్తూ.. అంతో ఇంతో కమిషన్ వస్తే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చునని.. చుట్టాలతో, తెలిసిన వాళ్లతో చిట్టీలు వేయించి.. చివరికి వారికి డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ఏజెంట్. ఉన్నట్లుండి కంపెనీ బోర్డు తిప్పేయడంతో.. చిట్టీలు కట్టిన వారికి సమాధానం చెప్పలేక, డబ్బులు తిరిగి ఇవ్వలేక.. అప్పుల ఊబిలో కూరుకుపోయి చావే శరణ్యం అనుకుని సూసైడ్ చేసుకోవడం కరీంనగర్ జిల్లాలో విషాదం మిగిల్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన చింతల రాజయ్య(46) అనే వ్యక్తి అక్షర చిట్ ఫండ్స్ కరీంనగర్ రాంపూర్ బ్రాంచ్ ఏజెంట్ గా పనిచేశాడు. కొంతమందితో చిట్టీలు వేయించడంతో పాటు.. సొంతంగా కొన్ని చిట్టీలు నడిపేవాడు. అదే విధంగా వివిధ స్కీమ్ లు, డిపాజిట్లు చేయించేవాడు.
ALSO READ : SLBC టన్నెల్ ప్రమాదం: ఆ నలుగురు ఎక్కడున్నారో గుర్తించాం: మంత్రి జూపల్లి
అయితే అక్షర చిట్ ఫండ్ కొన్నాళ్లుగా కార్యకలాపాలు నిలిపివేసింది. డబ్బులు చెల్లించకుండా బోర్డు తిప్పేయడంతో చిట్టీలు వేసిన వారికి డబ్బులు చెల్లించలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అతని బంధువులు చెబుతున్నారు. ఆర్థికంగా దెబ్బ తినటంతో తన ద్వారా చిట్టీలు వేసిన కస్టమర్ల నుండి ఒత్తిడి ఎక్కువై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసుకుని విచారణ చేపట్టారు.