నరకంలా ఉంది.. ఆ ఫుడ్ తినలేక పోయా.. మనిషి అనేవాడు జైలుకు పోవద్దు: జానీ

నరకంలా ఉంది.. ఆ ఫుడ్ తినలేక పోయా.. మనిషి అనేవాడు జైలుకు పోవద్దు: జానీ

లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లిన కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీ.. తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో అక్టోబర్ 25న జైలు నుండి విడుదల అయ్యారు. జ్యుడిషియల్ రిమాండ్‎లో భాగంగా 36 రోజుల పాటు జైలులో ఉన్న జానీ.. బయటకు వచ్చిన అనంతరం జైలు జీవితంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇంకా జైల్లో ఉన్నట్టే ఉంది.  ఆ ఫుడ్ తినలేక పోయా. మనిషి అనేవాడు జైలుకు పోవద్దు. బయటికంటే జైల్లో నరకం ఉంటది. ఇలా ఎలా జరిగిందో ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఇంకో రెండు రోజులు గడిస్తే సాధారణ స్థితికి వస్తా. రెండు రోజుల వరకు ఎవరితో మాట్లాడను. మీడియా ముందుకు ఇప్పట్లో రాను. నిజాం పేట్‎లో ఉన్న సుమలత వాళ్ల ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటూ. అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తా’’ అని అన్నారు. 

కాగా, లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీ జైలు నుండి విడుదల అయ్యారు. జ్యుడిషియల్ రిమాండ్‎లో భాగంగా చంచల్ గూడ జైల్లో ఉన్న జానీకి తెలంగాణ హైకోర్టు 2024, అక్టోబర్ 24న బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ ఇవ్వడంతో 2024, అక్టోబర్ 25న జానీ చంచల్ గూడ జైలు నుండి రిలీజ్ అయ్యారు. 

ALSO READ | లైంగిక వేధింపుల కేసు: జైలు నుంచి జానీ విడుదల

జానీ తనపై  లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు జానీని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పలుమార్లు జానీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం నిరాకరించింది. 

నేషనల్ అవార్డు అందుకునేందుకు మధ్యలో ఐదు రోజుల పాటు కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ కావడంతో కేంద్ర ప్రభుత్వం జానీకి అవార్డ్‎ను రద్దు చేసింది. దీంతో న్యాయస్థానం బెయిల్ రద్దు చేయగా.. తిరిగి జానీ మళ్లీ జైలుకెళ్లారు. ఈ సారి జానీ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో 36 రోజులుగా చంచల్ గూడ జైల్లో ఉన్న జానీ.. ఎట్టకేలకు శుక్రవారం విడుదల అయ్యారు.