
హైదరాబాద్, వెలుగు : ఏటీఎం మెషీన్లో క్యాష్ డిపాజిట్ చేస్తున్న వ్యక్తిపై పెప్పర్ స్ర్పే చల్లి రూ.7 లక్షలు దోపిడీ చేసిన కేరళకు చెందిన నలుగురిని సిటీ సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3.25 లక్షల క్యాష్, పెప్పర్ స్ప్రే బాటిల్స్, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. వివరాలను టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు శనివారం మీడియాకు వెల్లడించారు. కేరళకు చెందిన ముజీబ్.. హిమాయత్నగర్లో ఉంటున్నాడు. హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా మనీ ట్రాన్జాక్షన్స్ చేస్తున్నాడు. హవాలా మార్గంలో సేకరించిన డబ్బును ఏటీఎం మెషీన్లలో డిపాజిట్ చేసేవాడు. ఇందుకోసం హిమాయత్నగర్లోని ఉర్దూ గల్లీలోఉండే కేరళకు చెందిన తన్సిఫ్ అలీ(24) సాయం తీసుకున్నాడు. ఇది గమనించిన తన్సిఫ్.. దోపిడీకి ప్లాన్ చేశాడు. కేరళకు చెందిన సహద్ (26), తనిష్ బరిక్కల్ (23), అబ్దుల్ ముహీస్ (23)తో కలిసి స్కెచ్ వేశాడు. ఈ నెల 3న వారు ముజీబ్ను అనుసరించారు. ఆరు ఏటీఎం సెంటర్లలో క్యాష్ డిపాజిట్ చేస్తున్న ముజీబ్ను తన్సిఫ్, అతని స్నేహితులు వెంబడించారు. హిమాయత్నగర్ లిబర్టీ వద్ద ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్యాష్ డిపాజిట్ సెంటర్ను తమకు అనుకూలమైన ప్రదేశంగా నిందితులు ఎంచుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలో ముందుగా ఇద్దరు ఏటీఎంలోకి వెళ్లారు. మరో ఇద్దరు కారులో కూర్చుని పరిసరాలను గమనించారు. ఏటీఎం సెంటర్లోకి వెళ్లిన ముబీబ్పై ఆ ఇద్దరు పెప్పర్ స్ప్రే కొట్టి రూ.7 లక్షలు దోచుకుని పరారయ్యారు. ముజీబ్ ఫిర్యాదుతో దోమలగూడ పోలీసులు కేసు ఫైల్ చేశారు. 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీలు,సెల్ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు.